సీతక్క మనసంతా చంద్రన్నతోనే .. టీడీపీ అధినేతను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్ : పార్టీలు మారాక ఇతర పార్టీ సీనియర్ లీడర్లను కలువడం అరుదు. ఇక పండుగలు, ఫంక్షన్లంటే ఎవరికీ వారే యుమనా తీరే. కానీ కొందరు మాత్రం పార్టీలు మారినా .. అధినేతలతో టచ్లో ఉంటారు. మర్యాదపూర్వకంగా కలుస్తారు, బాగోగులు తెలుసుకుంటారు. అలాంటి కోవకు చెందుతారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినా .. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలివిడిగానే ఉంటున్నారు. సమయం ఉంటే కలిసి మంచి, చెడులు అడిగి తెలుసుకుంటున్నారు.
సీతక్క .. స్టైలే వేరు
మిగతా వారి కన్నా సీతక్క ఎందుకు విభిన్నం అని కదా మీ సందేహం. ఔను తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇప్పటికీ సీతక్క ఆప్యాయంగా మాట్లాడాతారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి .. ఎమ్మెల్యేగా ఎన్నికైనా చంద్రబాబును అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒకరోజు ముందుగానే చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆమెతోపాటు మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ఉన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే సీతక్క, పరిటాల సునీత రాఖీ కట్టారు. తర్వాత వారు వర్తమాన రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణ రాజకీయాల గురించి సీతక్కను చంద్రబాబు అడిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉందని కూడా అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ నాయకులు పార్టీ మారడం సహజమని .. కానీ పార్టీ మారినా సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నట్టు తెలుస్తోంది.
సీతక్క .. యు ఆర్ గ్రేట్
ఎమ్మెల్యే సీతక్క టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తనకు రాఖీ కట్టేందుకు వచ్చిన సీతక్కను చంద్రబాబు అభినందించారు. ఆమె ఉన్నతమైన వ్యక్తిత్తమని కొనియాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితోపాటు సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్పై సీతక్క విజయభేరీ మోగించారు.
ఇదీ నేపథ్యం ..
సీతక్క అసలు పేరు ధానుసరి అనసూర్య కాలక్రమంలో సీతక్కగా మారిపోయింది. వరంగల్ జిల్లా ఏటూరునాగరంలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివారు. 1987లో 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జనశక్తి సంస్థలో చేరారు. ఏటూరునాగారం పరిధిలో తుపాకీ చేతబట్టి .. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. దాదాపు ఏడేళ్ల తర్వాత జనశక్తి నక్సలైట్ విభాగానికి గుడ్ బై చప్పారు. 1994లో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలువాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో లొంగిపోయారు. తర్వాత దూరవిద్య ద్వారా చదువుకొన్నారు. లా పూర్తి చేశారు. తర్వాత టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు దృష్టిలోపడ్డారు. ఆయన పిలుపుమేరకు 2003లో టీడీపీలో చేరారు.
మూడోస్సారి ఎమ్మెల్యేగా ..
పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. 2004లో ములుగు అసెంబ్లీ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2009లో రెండోసారి విజయం సాధించారు. 2014లో అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. దీంతో టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ .. ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. టీడీపీ వీడినా .. ఆ పార్టీ అధినేతతో సీతక్క సత్సంబంధాలు కొనసాగించడంపై సర్వత్రా హర్ష వ్యక్తమవుతుంది.