టిక్కెట్పై టెన్షన్, వారిలో గందరగోళం: సీతక్క పరిస్థితి ఏమిటి? పావులు కదుపుతున్నారు
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు సీతక్క వంటి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఆయా నియోజకవర్గాలపై అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి.
వరంగల్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు సీతక్క వంటి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఆయా నియోజకవర్గాలపై అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ములుగు నియోజకవర్గంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కొడంగల్లో రేవంత్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి మంత్రి
సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు. ములుగులో టీడీపీకీ సరైన లీడర్ లేక ఇబ్బంది పడుతోంది. దీంతో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో పోటీ నెలకొంది.
టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే ప్రశ్న
2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ తరఫున పోదెం వీరయ్య, సీతక్కలు తలబడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. దీంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. రేవంత్ వెంట వచ్చిన వారికి హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఇది అప్పటికే ఉన్న కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టిస్తుండగా, ఎప్పటి నుంచో తాను పార్టీలో ఉంటూ పోటీ చేస్తున్నందున తనకు దక్కుతుందని మరొకరు భావిస్తున్నారు. ఇది ఇంకో వర్గానికి ఆందోళనగా ఉంది.
కలిశారు కానీ, ఎడమొహం పెడమొహం
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పోదెం వీరయ్యను సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ ఆ తర్వాత ఇద్దరు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు, సీతక్క చేరిక నేపథ్యంలో వీరయ్య కూడా దూకుడు పెంచారని అంటున్నారు.
పాదయాత్రకు సిద్ధమైన వీరయ్య
ఇది నిజమేనన్నట్లు ఆయన నియోజకవర్గంలో పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న సీతక్క మద్దతు ఇస్తారా అనేది ప్రశ్నగా మారింది. ఇది స్థానిక పార్టీ కేడర్ను అయోమయానికి గురి చేస్తోంది.
హామీతో వచ్చిన సీతక్క, వీరయ్య ఆందోళన
సీతక్క రాకతో వీరయ్య వర్గంలో ఆందోళన ప్రారంభమైందని అంటున్నారు. 1999, 2004లో గెలిచిన వీరయ్య 2009లో సీతక్క చేతిలో, గత ఎన్నికల్లో చందూలాల్ చేతిలో ఓడిపోయారు. అయితే తన ప్రత్యర్థి పార్టీలోకి రావడం ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ములుగు టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాకే సీతక్క పార్టీలోకి వచ్చిందనే ప్రచారం వీరయ్య వర్గంలో కలవరం రేపుతోంది. అయితే, ఇటీవలే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి టిక్కెట్ పైన కొంత స్పష్టత తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా ముందుకు సీతక్క
సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరాక నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు చాలామంది ఆమె వెంటే నడిచారు. వీరయ్య కొంత దూకుడుగా వెళ్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తును ఆమె వ్యూహాత్మకంగా మలుచుకోవడంపై దృష్టి పెట్టారు. సీతక్క, వీరయ్యలు ఇరువురు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పైన ఆశ పెట్టుకున్నారు. దీంతో కార్యకర్తలు మాత్రం సందిగ్ధంలో ఉన్నారు.