సెల్ఫ్ డిస్మిస్ నిర్ణయం..!సెల్ఫ్ గోల్ గా మారిందా..?కార్మికుల అంశంలో కేసీఆర్ వ్యూహం తలకిందులైందా..?
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆర్టీసీ కార్మికుల అంశంలో మదన పడుతున్నట్టు తెలుస్తోంది. కార్మికుల సమ్మె విషయంలో చంద్రశేఖర్ రావు అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి కావడం ప్రభుత్వ వర్గాల్లో మింగుడుపడని అంశంగా మారింది. ఆర్టీసి కార్మికుల సమ్మెను సామ బేద దండోపాయ మార్గంలో అణచివేయాలని చూసినా ముఖ్యమంత్రికి సాద్యం కాలేదు. పైగా సమ్మె ప్రభావం ప్రభుత్వం మీద ప్రతిబింబింస్తుండడంతో ఏ చేయాలో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా కోర్ట్ విచారణ, సూచనలు కూడా ప్రభుత్వానికి శరాఘాతంలా పరిణమించడంతో సెల్ప్ డిస్మిస్ నిర్ణయం సెల్ప్ గోల్ గా మారిందా అనే చర్చ ప్రగతి భవన్ వర్గాల్లో మొదలైనట్టు తెలుస్తోంది.
టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?
ఉగ్రరూపం దాలుస్తున్న ఆర్టీసి సమ్మె..! ఫలించని ప్రభుత్వ వ్యూహాలు..!!
ఆర్టీసి సమ్మె ప్రభావం వల్ల రవాణా వ్యవస్థ నిర్వీర్యమైనప్పటికి, తెలంగాణలోని విపక్ష పార్టీల్లో మాత్రం ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది. కార్మికులకు సంఘీభావం పేరుతో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. రాజ్ భవన్ లో గవర్నర్ కి విజ్ఞాపన పత్రం అందివ్వాలన్నా, దర్నాలు, దీక్షల్లో పాల్గొనాలన్నా తెలంగాణలోని విపక్షపార్టీలన్ని కలిసికట్టుగా కార్యచరణ రూపొందించుకుంటున్నాయి. బహిరంగ సమావేశాల్లో కూడా అన్ని పార్టీలు వేదికను పంచుకుంటున్నాయి. ఈ పరిణామం వల్ల అధికార పార్టీ కాస్త అసంతీప్తిగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే సంస్థకు భవిత ఉంటుందని, విలీనం చేయకపోతే ఆర్టీసికి మనుగడ లేదంటూ సకలజన భేరి సందర్భంగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా చేసిన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది.
మొదట మొండిగా ఉన్న సీఎం..! తర్వాత సమ్మె విరమింపజేసే ప్రయత్నాలు..!!
అసలు ఆర్టీసి కార్మికుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మొదట్లో చాలా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. సెల్ప్ డిస్మిస్ పేరుతో కార్మికులను దారిలోకి తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారు. ఆ తర్వాత కార్మిక నేతలు భయపెట్టించేందుకు వ్యక్తిగత కేసులను కూడా పెట్టించారు. న్యాయస్థానంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించారు. కాని కోర్ట్ విచారణలు ప్రభుత్వానికి ఏకు మేకయ్యే పరిస్ధితికి చేరుకుంది. దీంతో క్షేత్రస్థాయిలో ఆర్టీసీ కార్మికులను బుజ్జగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. అయితే, ఈ వ్యూహాన్ని అమలు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించబోతున్నారు చంద్రశేఖర్ రావు.
కోర్ట్ ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం..! సంధి దిశగా కేసీఆర్ ప్రత్నాలు..!!
గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె ఫలితంగా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ అంశంపై కచ్చితంగా విస్తృతస్థాయిలోనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కీలక నిర్ణయాలు సైతం వెలువడవచ్చు. అయితే, కార్మికులను విభజించి పాలించే ఎత్తుగడలో బిజీగా ఉన్న ప్రభుత్వ పెద్దలు, ఇందుకోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ప్రజల్లో అధికార పార్టీపై అసమ్మతి పెరుగుతోందన్న ఇంటెలిజెన్స్ నివేదికలు అధినేత చేతికి అందడంతో ఇప్పుడు కార్మికుల వైపు నుంచే నరుక్కుంటు రావాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్టు సమాచారం.
మంత్రులను రంగంలోకి దించుతున్న సీఎం..! ససేమిరా అంటున్న కార్మిక సంఘాలు..!!
సీఎం చంద్రశేఖర్ రావు తరచూ సమ్మెల గొడవ లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండే శాశ్వత చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కార్మికులతో మాట్లాడే బాధ్యత కరీంనగర్కు చెందిన ఓ మంత్రికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన ఇటు క్షేత్రస్థాయిలో, అటు హైదరాబాద్లో కార్మికులతో చర్చలు జరుపుతూ వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా కార్మిక నేతలు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. పైగా, సమ్మె అంశంలో తమనెప్పుడూ సంప్రదించవద్దని, కార్మిక నేతలు అంటున్నారట. తమను ఒప్పించే బదులుగా, ముఖ్యమంత్రినే ఒప్పించాలని సూచిస్తున్నారట కార్మిక నేతలు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సదరు మంత్రి చేతులెత్తేసిన అంశాన్ని సీఎంకు విన్నవించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సీఎం సెల్ప్ డిస్మస్ నిర్ణయం చంద్రశేఖర్ రావుకు సెల్ప్ గోల్ గా పరిణమించే ప్రమాదం పొంచి ఉందనే చర్చ జరుగుతోంది.