కట్నం అడిగిన అల్లుడిని తాళ్లతో కట్టేసి, కొట్టిచంపారు
కట్నం అడిగిన అల్లుడి కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి ఇటుకలు, సుత్తెతో మోది అత్తింటివారు హత్య చేశారు.
వరంగల్: కట్నం అడిగిన అల్లుడి కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి ఇటుకలు, సుత్తెతో మోది అత్తింటివారు హత్య చేశారు. ఈ దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం వంగర పంచాయతీ పరిధిలోని పీవీ నగర్కు చెందిన మాడ్య వీరస్వామి(43) అదే గ్రామానికి చెందిన గిద్దె పద్మను పదహారేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం భవాని(13), భరత్(10) అనే ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, గ్రామంలో అత్తగారిల్లు ఖాళీగా ఉంటుండటంతో భార్యభర్తలు కొద్ది కాలంగా అక్కడే ఉంటున్నారు. ఇటీవల వీరస్వామి అత్త,మామ గిద్దె దుర్గయ్య, ఎల్లమ్మలు వచ్చి మా ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో వీరస్వామి ఇళ్లు ఖాళీ చేసి స్థానిక సబ్స్టేషన్ సమీపంలో ఒక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ భార్య తెచ్చే అన్నం తినడం, లేదంటే మిత్రుల ఇళ్లల్లో పూట గడపటం చేస్తున్నాడు.
ఈ క్రమంలో మీ అమ్మనాన్నలను అడిగి కొంత డబ్బు తీసుకువస్తే అద్దె ఇంట్లో ఉండొచ్చని వీరస్వామి తరచూ భార్య పద్మతో అంటుండేవాడు. ఈ మేరకు మంగళవారం రాత్రి వీరస్వామి అత్తగారింటికి వెళ్లి వివాహ సమయంలో డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు కట్నం ఇస్తే మా బతుకు మేం బతుకుతామని చెప్పాడు. ఈ విషయంపై భార్య పద్మ, బావమరుదులు రవీందర్, సదానందం, మామ దుర్గయ్య, అత్త ఎల్లమ్మలతో గొడవపడ్డాడు.
డబ్బులు ఇవ్వకుంటే నా కొడుకొని నేను తీసుకెళ్తానని భరత్ను ఎత్తుకోవడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా దాడి చేయడంతో కిందపడిపోయాడు. వెంటనే భార్య పద్మ కాళ్లు, చేతులను తాళ్లతో బంధించగా బావమరుదులు ఇటుకలు, మామ సుత్తేతో దాడి చేసి హత్య చేసినట్లు మృతుడి కుమారుడు భరత్ తెలిపారు.
విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ సతీష్చందర్రావు, వంగర ఎస్సై హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు. హత్యకు ఉపయోగించిన తాడు, సుత్తే స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని హుజురాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ప్రాణం తీసిన సెల్ఫీ: కాలువలో పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
సెల్ఫీ మోజు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణం తీసింది. కళాశాలకు బంక్ కొట్టిన నలుగురు విద్యార్థులు నగర సమీపంలోని కెనాల్కు ఈత కోసం వెళ్లి సెల్ఫీ దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. కేయూ పోలీసులు, సహవిద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పి కార్తీక్ (21), వంశీ, శ్రీకాంత్, రాజ్కుమార్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు నయీంనగర్లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తుండేవారు.
బుధవారం కళాశాలకు బంక్ కొట్టిన నలుగురు విద్యార్థులు సమీపంలోని కెనాల్కు ఈత కోసం వెళ్లారు. వీరికి ఈత రాకున్నప్పటికీ నీటిలో దిగడంతో పాటు సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్తీక్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. కార్తీక్ను మిగతా ముగ్గురు విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేసిననప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న కేయూ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం. అలీ, ఎస్ఐ అశోక్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసే చర్యలు చేపట్టారు.