కాంగ్రెస్ లో కుమ్ములాట: రేవంత్ రెడ్డిపై వీహెచ్ ఫైర్..రీజన్ ఇదేనా !!
తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా,ఆ సమస్యలపై పోరాటం పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారిలో వారు ఘర్షణ పడటం మానుకోవడం లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల తీరు పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు అద్దం పడుతుంది. తాజాగా మరోమారు టీపీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్న వేళ వీహెచ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చెయ్యటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు
ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన నాటి నుండి చాలామంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ కు ఇస్తున్న ప్రాధాన్యత కూడా పార్టీ నేతలకు నచ్చడం లేదు. దీంతో ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డి మీద పార్టీ సీనియర్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా మొదటి నుండి రేవంత్ ను వ్యతిరేకించిన వారిలో వీహెచ్ ఒకరు .
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి వారిని చూడలేదన్న వీహెచ్
గతంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వడానికి వీలు లేదని, పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారని,టిడిపి నుండి వచ్చిన వారికి ఎలా అవకాశం ఇస్తారని విమర్శలు గుప్పించిన విహెచ్ ఇప్పుడు తాజాగా మరోమారు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి వారిని తానెప్పుడూ చూడలేదని, రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్. రేవంత్ రెడ్డి అనుచరులు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు రేవంత్ పనే
నేనే ముఖ్యమంత్రి అని గతంలో ఎవరో చెప్పుకో లేదని, మా లాంటి సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టించడం రేవంత్ రెడ్డి ఆపాలని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియనంత పిచ్చోళ్ళము కాదని, ఇకనైనా పార్టీ నేతలను కించపరిచేలా చేస్తున్న చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి, పార్టీ అంతర్గత అంశంగా భావించి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నామని చెప్పిన వీహెచ్ రోజుకో రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఏకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీనే సోనియా గాంధీ కుటుంబాన్నే చీలుస్తున్నారని మండిపడ్డారు.
కోర్ కమిటీ మీటింగ్ పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రియాంక గ్రూప్ లో చేరామని కొత్త ప్రచారం చేసుకుంటున్నారన్న వీహెచ్ సోనియాగాంధీ వయసు మీరింది అని రాహుల్ గాంధీ పక్కకు తప్పుకున్నారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద, పార్టీలోని సీనియర్ నేతల మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కోర్ కమిటీ సమావేశం పెట్టి మరీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వీహెచ్.
టీపీసీసీ చీఫ్ దుమారం నేపధ్యంలోనేనా ?
ఇక మొన్నటికి మొన్న ఢిల్లీ హై కమాండ్ టీ పిసిసి అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోనున్నారని అవకాశం తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వీహెచ్ కూడా రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా ఉండేందుకే ఈ దుమారం అంతా అన్న చర్చ రేవంత్ వర్గంలో జరుగుతోంది . మొత్తానికి వర్గపోరుతో తెలంగాణా కాంగ్రెస్ తన పట్టును కోల్పోతుంది .