TNR: కరోనా బారిన పడి సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అసాధారణ స్థితిలో ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే ఈ సారి ఈ మహమ్మారి కాటుకు పలువురు ప్రముఖులు తనువు చాలిస్తున్నారు. ప్రాణాలు వదులుతున్నారు. ప్రత్యేకించి- మీడియాపై కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటోంది. ఇప్పటికే అమర్నాథ్ వంటి సీనియర్ జర్నలిస్టులు కన్నుమూశారు. తాజాగా- మరొకరు ఆ మహమ్మారికి బలి అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్, క్రిటిక్ టీఎన్నార్ కరోనాతో కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు తుమ్మల నరసింహా రెడ్డి.
ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. Frankly with TNR అనే కార్యక్రమంతో ఆయన తెలుగు మీడియాలో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునే వారు. ఈ మధ్యకాలంలోనే ఆయన వెండితెరపైనా అడుగు పెట్టారు. కొద్దిరోజుల కిందట టీఎన్నార్ అనారోగ్యానికి గురి కావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.
దీనితో మల్కాజ్గిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తింది. దీనితో ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు డాక్టర్లు. అదే సమయంలో ఆక్సిజన్ లెవెల్ అనూహ్యంగా క్షీణించింది. మృత్యువుతో పోరాడుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఛానల్ నిర్వహించే ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణం పట్ల అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
టీఎన్నార్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. #RIPTNR అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉండటం ఆయనకు ఉన్న అభిమానానికి అద్దం పడుతోంది. టీఎన్నార్తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీఎన్నార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.