కరోనాతో బస్తర్ అడవుల్లో మావోయిస్టు అగ్ర నేత హరిభూషణ్ మృతి...
మావోయిస్టు అగ్ర నేత యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కోవిడ్తో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో సోమవారం(జూన్ 21) రాత్రి ఆయన మరణించినట్లు ప్రచారం జరుగుతోంది.హరిభూషణ్ మృతిపై ఇప్పటికైతే మావోయిస్టు పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
హరిభూషణ్ స్వస్థలం మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తగూడెం మండలం మరగూడ. 1995లో ఆయన మావోయిస్టు పార్టీలో చేరారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న హరిభూషణ్ పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో వాంటెడ్గా ఉన్నారు. గతంలో పువ్వర్తి, తడపలగుట్ట ఎదురు కాల్పుల్లో హరిభూషణ్ మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన చనిపోయారన్న ప్రచారం జరిగింది.
బస్తర్ అడవుల్లో మావోయిస్టులు కరోనా బారినపడ్డారని గతంలో వార్తలు రాగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ దాన్ని ఖండిచింది. ఈ మేరకు సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట ప్రకటన విడుదలైంది. ఒకవేళ పార్టీలో ఎవరైనా కరోనా బారినపడితే వెల్లడిస్తామని అందులో పేర్కొన్నారు. తాజాగా హరిభూషణ్ కరోనాతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండటంతో దండకారణ్యంలో చాలామంది మావోయిస్టులు కరోనా బారినపడి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత నెలలో మావోయిస్టు నేత గడ్డం మధుకర్ కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వరంగల్లో అరెస్టు తర్వాత ఆయన కరోనా బారినపడ్డ ఆయన... ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధుకర్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన మధుకర్ 1999లో నక్సలైట్ ఉద్యమంలో చేరారు.