టీ-టీడీపీలో రేవంత్ సోలో పెర్ఫామెన్స్: అసంతృప్తితో రగులుతున్న సీనియర్లు!
తెలంగాణలో టీడీపీ అంటే.. రేవంత్ ఒక్కరే అన్న రీతిలో ఆయన ధోరణి ఉండటం సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదు.
హైదరాబాద్: ఓటుకు నోటు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఎంత తీసికట్టుగా తయారైందో అందరికీ తెలిసిందే. అధినేత చంద్రబాబు తన మకాంను విజయవాడకు మార్చేయడంతో.. ఇక్కడి నేతల్లో సమన్వయం పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ తీరుపై సీనియర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
పార్టీకి సంబంధించిన కార్యాచరణలపై తాను ఒక్కడే నిర్ణయం తీసుకోవడం.. సీనియర్లను పక్కనబెట్టి తానే జనంలోకి వెళ్లడం వంటి చర్యలు పార్టీలో సీనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో తెలంగాణలో పార్టీ బలోపేతం సంగతి అటు ఉంచితే.. అంతర్గత విబేధాలతో పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదు.
అందరు కలిసి ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలని గతంలో అధినేత చంద్రబాబు సూచించినా.. ఆయన మాటలేవి రేవంత్ చెవికి ఎక్కలేదన్నది సీనియర్ల అసంతృప్తికి ప్రధాన కారణం. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం పోరాటం చేసిన సందర్బంలోను.. రేవంత్ ఒక్కడే ఫోకస్ అయ్యేలా కార్యాచరణను ప్లాన్ చేసుకోవడం.. పైగా పార్టీ ప్రస్తావన కూడా అందులో లేకపోవడం అప్పట్లో సీనియర్ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
ఇక ఇప్పుడు విద్యార్థి పోరు యాత్ర. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి సమస్యలతో పాటు, ఇంజనీరింగ్ కాలేజీల మూసివేతపై విద్యార్థి పోరు ద్వారా పోరాటం చేయబోతున్నారు రేవంత్. అయితే ఈ కార్యచరణ కూడా రేవంత్ కేంద్రంగానే సాగుతుంది తప్ప.. సీనియర్లను అసలేమాత్రం లెక్క చేయట్లేదన్న వాదన అంతర్గతంగా వినిపిస్తోంది.
తెలంగాణలో టీడీపీ అంటే.. రేవంత్ ఒక్కరే అన్న రీతిలో ఆయన ధోరణి ఉండటం సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పుడీ విషయాన్ని కక్కలేక.. మింగలేక అన్న తీరులో.. లోలోపలే వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది.