కెసిఆర్కు దగ్గరౌతున్న తలసాని: హైదరాబాద్ సీనియర్ల అసంతృప్తి?
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పార్టీలో (టిఆర్ఎస్) ప్రాధాన్యత పెరగడం పట్ల పలువురు టిఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. తలసాని సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున గెలిచి, ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి, మంత్రి అయ్యారు.
ఆయన చేరికను తొలుత స్వాగతించిన నేతలు కూడా పలువురు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. అందుకు కారణం.. అయనకు నగర పార్టీలో ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతుండటమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిలు తలసాని వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నగరంలో గట్టి పట్టు ఉన్న నేతగా, టిడిపి నుంచి తీగల కృష్ణా రెడ్డి వంటి ఎమ్మెల్యేను టీఆర్ఎస్ వైపు తీసుకు వచ్చిన నేతగా తలసాని ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిలో ఉన్నారు. తలసాని చేరిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీకి బాగా ఉపకరిస్తుందని కెసిఆర్ సహా అందరూ భావిస్తున్నారు.
త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. ఈ నేపథ్యంలో నగరంలో తలసానికి ఉన్న పట్టు దృష్ట్యా ఆయనకు అందలం ఎక్కించారనే వాదనలు ఉన్నాయి. తలసాని పార్టీలో చేరినప్పుడు నగరానికి చెందిన మిగతా నేతలు కూడా స్వాగతించారు.
ఆయన చేరిక గ్రేటర్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని వారు భావించారు. అయితే, నగర పార్టీలో ఆయన క్రమంగా పట్టు సాధిస్తున్న కారణంగా ఇప్పుడు తమ ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తి పలువురిలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వారు అప్ సెట్ అవుతున్నారట.
నగరంలో పార్టీని బలోపేతం చేయడం, ఇతర కార్యక్రమాలను ఎక్కువగా తలసాని చూస్తున్నారని, ఇది పలువురు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నగరం నుంచి టిఆర్ఎస్ ముఖ్య నేతలు మహమూద్ అలీ, నాయినిలతో పాటు పద్మారావు కూడా కేబినెట్లో ఉన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తలసానిని ఆహ్వానించి, మంత్రి పదవి కట్టబెట్టారనే వాదనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆయన నగరంలోని ముఖ్య పార్టీ నేతలు, మంత్రులకే చెక్ పెట్టేలా ఎదుగుతున్నారని అంటున్నారు. దీనిని వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం తలసాని పాతబస్తీలో తనకు సమాచారం ఇవ్వకుండానే పాదయాత్ర చేశారని, దీనిని మహమూద్ అలీ జీర్ణించుకోలేకపోయారని, అతను అధిష్టానం దృష్టికి దీనిని తీసుకు వెళ్లాక, తలసాని ఆపేశారని అంటున్నారు.
టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డిని పార్టీలోకి తీసుకు రావడం, పార్టీని నగరంలో బలోపేతం చేయడం వంటి అంశాల విషయంలో మొత్తం క్రెడిట్ అంతా తలసానికి దక్కుతుందనే అంశం పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కెసిఆర్ ఇదే నియోజకవర్గంలో రెండుసార్లు పర్యటించారు. అంతేకాదు, తొలి హౌసింగ్ స్కీంను బోయిగూడకు ప్రకటించారు. ఇది సనత్ నగర్ నియోజవకర్గంలో ఉంది. ఇలా నగర టిఆర్ఎస్లో తలసాని అందరి కంటే దూసుకెళ్తున్నారనే అసహనం సీనియర్ నేతల్లో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.