గ్రూప్2 అభ్యర్థుల సంచలనం .. సామూహిక కారుణ్య మరణాలకు అనుమతివ్వండి
వారంతా కష్టపడి చదివి టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన వారు. పరీక్షలు రాసి మూడేళ్ళు అయినా, ఫలితాలు వచ్చినా ఉద్యోగం మాత్రం రాలేదని దిక్కు తోచని స్థితిలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తెలంగాణా గ్రూప్-2 అభ్యర్థులు మానవహక్కుల కమిషన్ ఆశ్రయించారు. తమ ఉద్యోగాల గురించి పట్టించుకునే నాధుడే లేరంటూ ఇలాంటి పరిస్థితుల్లో ఉండలేకపోతున్నామని కనీసం మూకుమ్మడిగా మెర్సీ డెత్ కైనా అనుమతి ఇవ్వండి అంటూ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు.
పవన్ అనుభవం ఎంత : మీరు భయపడతారు..నేను కాదు: చంద్రబాబు ఫైర్..!
పరీక్షలు రాసి మూడేళ్ళు అయినా ఉద్యోగం రాని గ్రూప్ 2 అభ్యర్థులు
నూతన రాష్ట్రం ఏర్పడి రెండేళ్ల నిరీక్షణ తర్వాత 2016లో టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసమే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నిమాకాల కోసం రాతపరీక్ష నిర్వహించి మూడేళ్ల క్రితమే ఫలితాలను కూడా విడుదల చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఈ ఫలితాలు, నియామక ప్రక్రియపై కొందరు అభ్యర్థులు కోర్డుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది.
టీఎస్పీఎస్సీ , ప్రభుత్వం పట్టించుకోక గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన
ఏ తప్పు చేయని అభ్యర్ధులకు ఉద్యోగాలు కల్పించాలని 2018 లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. ఇక్కడ కూడా సింగిల్ బెంచ్ తీర్పుకే మద్దతు లభించింది. కానీ టీఎస్పిఎస్సి, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.దీంతో అటు ఉద్యోగం కోసం ఎదురుచూడలేక...ఇటు ఆశలు వదులుకుని వేరే ఉద్యోగం చేయలేక అభ్యర్థులు నరకం అనుభవిస్తున్నారు. అందుకే మార్చి 22వ తేదీ శుక్రవారం అభ్యర్థులు భారీగా HRC కార్యాలయానికి తరలివచ్చారు.
ఉద్యోగం అయినా ఇప్పించండి.. కారుణ్య మరణం అయినా ఒప్పుకోండి
రెండున్నరేళ్లుగా కేవలం టీఎస్పీఎస్సీ చేస్తున్న అలసత్వం వల్లే తామింకా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించాలని తాము ఎన్నోమార్లు ఆందోళనలు, పోరాటాలు చేసినా స్పందన లేదని అభ్యర్థులు వెల్లడించారు. ఉద్యోగాలు రాకపోవడంతో వేరే ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్న అభ్యర్థులు 300 మంది హెచ్ఆర్సీ ని ఆశ్రయించి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఉద్యోగాలైనా ఇవ్వమని చెప్పండి లేదా సామూహిక కారుణ్య మరణాలకైనా అనుమతి ఇవ్వండి అని అభ్యర్థిస్తున్నారు