ఖమ్మం పాలిటిక్స్ ని షేక్ చేస్తున్న సెన్సేషనల్ పోస్టర్..
కలలో కూడా ఊహించని కాంబినేషన్ లను సెట్ చేస్తోంది పాలేరు ఉపఎన్నిక. టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ అధినేత జగన్ లను ఒకే పోస్టర్ లో చూడడం ఈ జన్మకు సాధ్యమయ్యే పనేనా.. కానీ పాలేరు ఉపఎన్నిక దాన్ని పటాపంచలు చేసింది. ఒక్క చంద్రబాబు జగన్ కాంబినేషన్ మాత్రమే కాదు. పోస్టర్ నిండా సెన్సేషనే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరూ ఒకే పోస్టర్ మీద దర్శనమిస్తున్నారు.
ఎన్నిక ఏదైనా తెలంగాణలో ఎదురే లేకుండా పోయిన టీఆర్ఎస్ ని నిలువరించడానికి ఇలా పార్టీలన్ని ఏకమయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డిని గెలిపించడానికి పార్టీలన్ని ఒక్క తాటిపైకి వచ్చాయి. మొత్తంగా అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ ని రౌండప్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే బీజేపీ మాత్రం ఓట్లు చీలిక తీసుకురాకుండా పోటీకి దూరంగా ఉండిపోగా ఎన్నికల బరిలో నిలిచిన సీపీఐ కి సీపీఎం మద్దతునిస్తున్న విషయం తెలిసిందే.
ఇన్ని పార్టీలన్ని ఏకమైనా టీఆర్ఎస్ దూకుడును నిలువరించడం అనుమానుంగానే తోస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అదీ, ఇదీ అన్న తేడా లేకుండా ప్రతీ ఎన్నికలోను టీఆర్ఎస్ విజృంభిస్తూనే ఉంది. ఒక్క నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలో మాత్రమే టీఆర్ఎస్ కి కాంగ్రెస్ చేతిలో చుక్కెదురైంది. అయితే దాని ప్రభావం టీఆర్ఎస్ పై అంతగా లేదనడానికి నిదర్శనం ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికలే. ప్రస్తుత పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కి కళ్ళెం వేయడానికి కాంగ్రెస్ చేస్తున్న విశ్వ ప్రయత్నాల్లో ఈ పోస్టర్ ఒకటి.
కాంగ్రెస్ ప్రయత్నాలు బాగానే ఉన్నాయి గానీ అంతిమంగా ప్రజాతీర్పుకు కట్టుబడాల్సిందే కాబట్టి పాలేరు జనం కాంగ్రెస్ పట్ల ఎలాంటి తీర్పు వెలువరిస్తారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.