తెలంగాణలో మాదే అధికారం: సుజన, జూన్ 2 ఉందిగా.. సెప్టెంబర్ 17 ఎందుకు: నాయిని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నారు. నిజాం కబందహస్తాల నుంచి సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విముక్తమైంది. దీనిని తెలంగాణ విమోచన, విలీన దినంగా జరుపుకుంటారు.
టిడిపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సుజన మాట్లాడారు.
2019 సంవత్సరంలో తెలంగాణలో అధికారం తమదేనని చెప్పారు. తెలంగాణలో టిడిపికి ఆదరణ తగ్గలేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి, ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ భవన్లో...
గాంధీ భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సీఎల్పీనేత జానారెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి కార్యాలయంలో...
బిజెపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిఆర్ఎస్ కార్యాలయంలో...
తెలంగాణ విమోచన సందర్భంగా తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం కోసం డిమాండ్ చేశామన్నారు.
అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక జూన్ 2 అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటుంటే మరొకటి ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.
రైతు సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కేంద్రాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, సాగునీటి ప్రాజెక్టులు లేకనే రైతులు నిరాశ చెందుతున్నారని, వాటి పరిష్కారం కోసం గ్రామాల్లో గోదాముల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. రైతులకు రైతు బంధు పథకం కింద పంటను గోదాముల్లో నిలువ చేసుకుని సరైన ధర వచ్చినప్పుడే అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
సాగునీటి పథకాలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి కరువును తరిమి కొడతామని చెప్పారు. బంగారు తెలంగాణ వైపు ప్రభుత్వం సాగుతుంటే ప్రతిపక్షాలు కావాలని రాజకీయాలు చేస్తున్నాయిన్నారు.
ఏకాభిప్రాయం కావాలి: కోదండరాం
సెప్టెంబర్ 17వ తేదీన పైన తెలంగాణలో బేధాభిప్రాయాలు ఉన్నాయని, వాటి పైన ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు.