తెలంగాణాలో సీరియస్ కేసులు తగ్గుముఖం.. రీజన్ చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి . నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇక తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన కరోనా కేసుల పై విశ్లేషణ జరిపి తెలంగాణ రాష్ట్రంలో సీరియస్ కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది.
Recommended Video
లక్షణాలు లేకుండానే అధికంగా కరోనా కేసులు
రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా లక్షణాలు లేకుండానే కరోనాతో బాధపడుతున్నట్లుగా కూడా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో 69 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులో మొత్తం 31 శాతం మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 124,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 86,225 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. కేవలం 37,738 మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్లుగా నిర్ధారించింది.
సీరియస్ కేసులు తగ్గుముఖం పట్టినట్టుగా వెల్లడి
సీరియస్ కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం కాంటాక్ట్ ట్రేసింగ్ లో కూడా ముందంజలో ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 కంటైన్మెంట్ జోన్లలో ప్రాథమిక, సెకండరీ కాంటాక్ట్లను గుర్తిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఉండటం, లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్ట్ చేయించుకోవడం వల్ల సీరియస్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
10 లక్షల మంది జనాభాలో 36,782 మందికి నిర్ధారణ పరీక్షలు
ఒకప్పటి కంటే ఇప్పుడు కరోనాను జయించడంలో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31,299 యాక్టివ్ కేసులు ఉంటే, వారిలో 24,216 మంది వివిధ సంస్థల ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నట్టుగా గుర్తించారు .రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల మంది జనాభాలో 36,782 మందికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు బులెటిన్లో తెలిపారు. ఇక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో 35 చోట్ల ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 చోట్ల చేస్తున్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,076 చోట్ల చేస్తున్నారు. అయితే కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్న కారణంగానే తక్కువ కేసులు వస్తున్నాయని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.