షాకింగ్ : బ్రిటన్ నుంచి తెలంగాణ వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్...
బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఈ ఏడుగురు క్వారెంటైన్లో ఉన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1200 మంది ప్రయాణికుల్లో 846 మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించారు. ఇందులో ఏడుగురికి పాజిటివ్గా నిర్దారణ కాగా.. వారి శాంపిల్స్ను సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ల్యాబ్కి పంపించారు. వీరికి సోకింది పాత కరోనా వైరసేనా లేక కొత్త స్ట్రెయిన్ బారినపడ్డారా అన్నది నిర్దారించనున్నారు.
బ్రిటన్ నుంచి వచ్చినవారికి కరోనా సోకిందన్న వార్తతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. బ్రిటన్లో వెలుగుచూసిన కరోనా సెకండ్ వేరియంట్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండటమే ఇందుకు కారణం. పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఇప్పటికే బ్రిటన్లో ఆస్పత్రులన్నీ 90శాతం నిండిపోయాయి. మరోవైపు శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్ జన్యువును విశ్లేషించేందుకు పరిశోధనలు జరుపుతున్నారు.
తాజాగా పాజిటివ్గా నిర్దారణ అయినవారి కాంటాక్ట్స్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ట్రాక్ చేస్తోంది. ఇటీవలి కాలంలో వారితో కలిసినవారిని గుర్తించి వారిని కూడా క్వారెంటైన్ చేయనున్నారు. పాజిటివ్గా తేలిన ఏడుగురిని హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ఒకవేళ వీరికి సోకింద కొత్త వేరియంట్ అని నిర్దారణ అయితే ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందించనున్నారు.
బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగుచూడటంతో భారత్లోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం(డిసెంబర్ 24) వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రకం కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈటల సూచించారు. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం,భౌతిక దూరం,తరుచూ చేతులను శానిటైజర్తో శుభ్రపరుచుకోవడం మరిచిపోవద్దన్నారు.
ప్రస్తుతం 11 సీటీఆర్ స్కాన్లు, 3 ఎంఆర్ఐ మెషీన్లను వెంటనే కొనుగోలు చేయాలని.. సాధ్యమైనంత త్వరగా వీటిని పేషెంట్ల చికిత్సకు అందుబాటులోకి తీసుకురావాలని ఈటల సూచించారు.