సెక్స్ రాకెట్ కేరాఫ్ స్పా, మసాజ్ సెంటర్: సిద్దార్థ్ చెప్పిన సంచలనాలివే!
డ్రగ్స్, మద్యానికి బానిసలను చేసి యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను ఇటీవల పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఇప్పటికే నగరంలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారగా.. తాజాగా బయటపడిన సెక్స్ రాకెట్ మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్, మద్యానికి బానిసలను చేసి యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను ఇటీవల పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితుడైన దాసరి సిద్దార్థ్ పలు కీలక విషయాలను తన వాంగ్మూలంలో వెల్లడించాడు.
హైటెక్ వ్యభిచారం: సిద్ధార్థ గుట్టు, ఇద్దరు సినీ ప్రముఖులతో లింక్స్
అందువల్లే సెక్స్ రాకెట్..
‘మత్తు మజా కోసం గంజాయిని తీసుకునేవాణ్ణి. కానీ ఏనాడూ కస్టమర్లకు అమ్మలేదు. ఆర్గనైజర్లందరం కలిసి పీల్చేవాళ్ళం. మసాజ్ సెంటర్లకు గంజాయి తీసుకురాలేదు' అని సిద్దార్థ్ తన వాగ్మూలంలో పేర్కొన్నాడు. జల్సాలకు అలవాటుపడి మసాజ్ వ్యాపారంలోకి వచ్చానని, భారీగా నష్టాలు రావడంతో వ్యభిచారం నిర్వహించానని అంగీకరించాడు.
12స్పా కేంద్రాల్లో 65మంది యువతులతో..
ఐదు రోజుల క్రితం మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలిల్లోని మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 12 స్పా కేంద్రాలపై సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దాసరి సిద్ధార్థ్ సహా 19 మందిని అరెస్ట్ చేయగా.. 65 మంది యువతులను రెస్క్కూ హోంకు తరలించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్లు కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు. తరచూ మసాజ్ సెంటర్లకు వచ్చేవారని విశ్వసనీయం సమాచారం.
జూనియర్ ఆర్టిస్టులు కూడా.. పెడ్లర్లతో లింకులు..
‘సిద్ధార్థకు ధూల్పేటలోని గంజాయి పెడ్లర్లతో లింక్లు ఉన్నట్లు గుర్తించాం. తానే గంజాయి తీసుకున్నానని, కస్టమర్లకు అమ్మలేదని చెప్పాడు. తన ఆర్గనైజర్లు, వ్యాపార భాగస్వాములతో కలిసి గంజాయి తీసుకున్నట్లు అంగీకరించాడు. కొకైన్, ఎల్ఎస్డీ లాంటి మాదకద్రవ్యాలను తీసుకునేవాడు కాదు. ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్లు మసాజ్ కేంద్రాలకు తరచూ వచ్చేవాళ్లని ప్రాథమికంగా నిర్ధారించాం. సిద్ధార్థ్ మెబైల్ కాల్ డేటాను విశ్లేషిస్తే.. ఈ విషయంపై ఒక స్పష్టత వస్తుంది' అని కేసు విచారిస్తున్న ఓ పోలీస్ అధికారి చెప్పారు.
బడా వ్యాపారవేత్తలు కూడా..
విచారణ సందర్భంగా పోలీసులు సిద్ధార్థ్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. దేశంలో మూడు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోనూ అతడికి నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. ఈ దందాలో సిద్ధార్థ్ను మించిన వారు కూడా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. వారికి పెద్దల సహకారం ఉందని సమాచారం. కొందరు బడా వ్యాపారవేత్తలు కూడా మసాజ్ సెంటర్లకు వచ్చేవారని ప్రాథమికంగా గుర్తించారు.
అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా..
ఈ కేసులో దర్యాప్తులో థాయ్ జాయ్ కంటే.. హైదరాబాద్లోనే మరింత లగ్జరీగా దొరుకుతుందని విషయం స్ఫష్టంగా తెలిసిందని మరో పోలీస్ అధికారి చెప్పారు. వ్యభిచారం ఒక్కటే కాదు.. అనైతిక కార్యకలాపాలకు మసాజ్ కేంద్రాలను అడ్డాలుగా ఏర్పాటు చేశారన్న కోణంలోనూ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పరారీలో ఉన్న థాయిలాండ్ యువతి, మరో ఇద్దరు వ్యాపార భాగస్వాములను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డ్రగ్స్ బానిసలుగా.. థాయ్ అమ్మాయిలు
సిద్ధార్థ్, అతని స్నేహితుల స్పాల్లో పట్టుకొని జగద్గిరిగుట్టలోని స్టేట్ హోమ్కు తరలించిన థాయ్ అమ్మాయిలు డ్రగ్స్కు బానిసలుగా మారారు. కొద్ది రోజులుగా డ్రగ్స్ లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సిద్ధార్థ్ స్వయంగా డ్రగ్స్ వాడటంతోపాటు మసాజ్ సేవల కోసం తీసుకొచ్చిన థాయ్ అమ్మాయిలకు కూడా అలవాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాను చెప్పినట్లు వారు నడుచుకునేలా చేసేందుకే వారిని డ్రగ్స్కు బానిసలను చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
సంపాదన ఇలా..
కాగా, స్పాల్లో పని చేస్తున్న థాయ్ అమ్మాయిలకు రూ.15,000 నుంచి 20,000 వరకు వేతనాలు ఇస్తున్నారు. థాయ్ కరెన్సీతో పోలిస్తే మన రూపాయి విలువ ఎక్కువ. వేతనాల కన్నా.. కస్టమర్లు ఇచ్చే టిప్లు ఇంకా ఎక్కువగా ఉంటాయని, సగటున నెలకు ఒక్కొక్కరు రూ. 50,000-90,000 వరకు సంపాదిస్తున్నారని తేలింది.
డ్రగ్స్ కోసం అల్లాడిపోతున్నారు...
హోంలోని థాయ్ అమ్మాయిలను రకరకాల ఫోబియోల నుంచి బయటకు తీసుకొచ్చి, సాధారణ స్థితికి వచ్చాక స్వదేశం పంపించాలని పోలీసులు భావించారు. కానీ, మొదటి రెండు రోజుల్లోనే వారు చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. తమకు కొకైన్, ఎల్ఎస్డీ కావాలంటూ కొందరు బాగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ‘డ్రగ్స్ తెచ్చివ్వండి.. లిక్కర్ ఇవ్వండి' అంటూ గొడవ చేస్తున్నట్లు సమాచారం. ఒకరిద్దరు అమ్మాయిలు అయితే దాడులకూ తెగబడుతున్నట్లు తెలిసింది. తమకు డ్రగ్స్ను సిద్ధార్థే అలవాటు చేశాడని, ఇప్పుడు అవి లేకపోతే పిచ్చెక్కిపోతోందని అమ్మాయిలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో రహస్య భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? అనేదానిపై ఆరా తీస్తున్నారు.