ప్రభుత్వం ఆదరిస్తే బయటకొస్తాం: సెక్స్ వర్కర్ల కన్నీటి గాథ
హైదరాబాద్: యాదాద్రిని (యాదగిరిగుట్ట) మరో తిరుపతి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. అయితే, గుట్టలో వ్యభిచార వృత్తిలో చాలామంది దశాబ్దాలుగా ఉంటున్నారు. దాదాపు వంద కుటుంబాల వరకు వ్యభిచార వృత్తి పైన జీవనం సాగిస్తున్నాయి.
వారు దశాబ్దాలుగా ఉంటున్నారు. యాదాద్రిని మరో తిరుపతిలా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నందున వ్యభిచార కూపంలో ఉన్న కుటుంబాలను ఇక్కడి నుంచి తరలించడం లేదా వారిని ఆ కూపం నుంచి బయటకు తీసుకు రావడం చేయాల్సి ఉంది. ఈ దిశలోను ప్రభుత్వం యోచిస్తోంది.
వంద కుటుంబాలకు పైగా ఇక్కడ వ్యభిచార వృత్తి పైన ఆధారపడి దశాబ్దాలుగా బతుకుతున్నాయి. వీరికి ప్రభుత్వం పునరావాసం కల్పించవలసి ఉంది. ఇది ప్రభుత్వానికి సవాలే అని చెప్పవచ్చు. తమను ఈ వృత్తి నుంచి బయటపడేసి.. ప్రభుత్వం ఆదుకుంటుందేమోనని చాలామంది ఎదురు చూస్తున్నారు.
26 ఏళ్ల ఓ సెక్స్ వర్కర్ ఈ విషయం గురించి చెప్పిన విషయాలు అందరి హృదయాన్ని కలచివేస్తోంది. తన తల్లి ఈ వృత్తిలోనే కొనసాగిందని, ఆమె ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోందని, తన ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేదని, దీంతో ఇప్పుడు గత్యంతరం లేని స్థితిలో పడువు వృత్తిలోకి దిగవలసి వచ్చిందని తెలిపింది. తన తల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు తాను ఈ దారిని వెతుక్కున్నానని చెప్పింది.
యాదాద్రిని తిరుపతిలా మార్చే ఉద్దేశ్యంలో భాగంగా వేశ్యా గృహాలను కూడా అక్కడ లేకుండా ప్రభుత్వం చేయనుంది. దీనిని వేశ్యావృత్తిలో కూరుకుపోయిన చాలామంది కూడా సమర్థిస్తున్నారు. అయితే, తమకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, తమకు ఉద్యోగం దొరికే వరకు తమ పిల్లలకు చదువు చెప్పించాలని కోరుకుంటున్నారు.
తాము కూడా ఈ వృత్తి నుంచి బయటపడాలనుకుంటున్నామని, కానీ తమకు ఎవరు కూడా పని ఇవ్వడం లేదని, అసలు తమను మనుషుల్లా చూడటం లేని, తమ వద్దకు వచ్చే పురుషులు కూడా తమను వేధిస్తున్నారని మరో మహిళ చెప్పింది.
గత ఏడాది ఆగస్టులోనే యాదాద్రిలోని వ్యభిచార కుటుంబాల లెక్క, వారికి కావాల్సిన పునరావాసాల పైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
112 కుటుంబాలు ఈ కూపంలో ఉన్నట్లుగా తేలింది. ఈ కుటుంబాల్లో మొత్తం 427 మంది ఉన్నారు. అందులో 147 మంది మహిళలు, 104 మంది పురుషులు ఉన్నారు. 176 మంది స్కూల్ లేదా కాలేజీ వెళ్లే వయస్సువారు. ఈ కుటుంబాలకు పునరావాసం, కల్పించే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు.