దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
కామారెడ్డి జిల్లాలో ఓ కీచక హెడ్ మాస్టర్ వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినులకు వీడియో కాల్ చేస్తున్న ఆ ప్రధానోపాధ్యాయుడు.. దుస్తులు విప్పి అందాలు చూపించాలని వారిని వేధిస్తున్నాడు. గతంలో డ్యాన్స్ క్లాసుల పేరుతో అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పాఠశాల విద్యార్థినులు చెప్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి వేధింపులపై స్థానిక విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థినులు స్కూల్ ఎదుట నిరసనకు దిగారు.
అసలేం జరిగింది...
కామారెడ్డి జిల్లా నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా రాముకి టీసీ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రాము ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేధింపులు బయటపెట్టిన విద్యార్థినులు
విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రధానోపాధ్యాయుడే కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట నిరసనకు దిగాయి. ఇదే క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి వేధింపుల గురించి స్కూల్ విద్యార్థినులు బయటపెట్టారు. కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఆన్లైన్ క్లాసుల పేరుతో తమను వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు.క్లాసులు చెప్పేందుకు వీడియో కాల్ చేసి... అందాలు చూపించాలని వేధించేవాడని వాపోతున్నారు.
గతంలోనూ డ్యాన్సు క్లాసుల పేరుతో
గతంలోనూ డ్యాన్సు క్లాసుల పేరుతో అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా డ్యాన్స్ నేర్పిస్తానని గదిలోకి తీసుకెళ్లి వేధించేవాడని ఆరోపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి చర్యలను నిరసిస్తూ విద్యార్థి నాయకులు,పాఠశాల విద్యార్థులు,వారి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది ఇదే కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గర్భవతిని అని చెప్పినా వినకుండా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.