ఉరి శిక్షలు పడినా మారరా .. ఐదేళ్ళ చిన్నారి పై , 13 ఏళ్ళ బాలికపై మృగాళ్ళ పాశవిక దాడి
9నెలల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన మృగాడికి మరణ దండన విధించి పట్టుమని నాలుగు రోజులైనా కాలేదు. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కామాంధులు పెట్రేగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం అభం శుభం తెలియని బాలికలను లైంగిక హింసకు గురి చేస్తున్నారు. బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా , కఠిన స్క్షలు వేస్తున్నా, కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మృగాల్లాంటి మగాళ్ళ బుద్ధి మాత్రం మారటం లేదు .
ఐదేళ్ళ చిన్నారిపై ఘాతుకం .. ఆడుకునే పాపను ఎత్తుకెళ్ళి దారుణం
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిపై జరిగిన ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఐదేళ్ల బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం రేగొండి గ్రామానికి చెందిన దంపతులు రోజు వారీ కూలీ చేస్తుంటారు. ప్రతి రోజు అంగన్వాడీకి వెళ్ళే ఐదేళ్ళ చిన్నారి ఆ రోజు సెలవు కావటంతో ఇంట్లో ఉంది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లారు. వరలక్ష్మి వ్రతం కావడంతో.. అంగన్వాడీకి సెలవు ఇవ్వటంతో ఆ బాలిక ఇంటి బయట ఆడుకుంటుంది. ఇక ఒంటరిగా ఉన్న ఆ బాలికను.. పొరుగున ఉండే 22 ఏళ్ళ నగేశ్ తన ఇంటికి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. మృగాడు చేసిన పనికి బాలిక కు జ్వరం వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కూతురి బుగ్గలు ఎర్రబడటం, ఒళ్లంతా జ్వరంతో కాలుతుండటంతో మాత్ర ఇచ్చి పడుకోబెట్టారు. మర్నాడు కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి వివరించింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నగేశ్ను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు చికిత్స అందించటంతో పాటు పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు.
13 ఏళ్ళ బాలికపై పాశవిక దాడికి పాల్పడిన మరో రాక్షసుడు
ఇక మరో ఘటనలో 13 ఏళ్ళ బాలికపై పాశవిక దాడికి దిగాడు ఓ కామాంధుడు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పద్మశాలిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు ఆ మృగాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలరాజ్ అనే వ్యక్తి వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి బాల్ రాజ్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్ని చట్టాలు ఉన్నా బాలికలకు రక్షణ కరువేనా ? ఈ దారుణాలు ఆగాలంటే సమాజంలో మార్పు కూడా అనివార్యం
ఇలా రోజుకో చోట బాలికలపై కామాంధుల దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు పసి మొగ్గలను చిదిమేస్తుం టే , బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠినతరమైన చట్టాలు ఉన్నా కామాంధులకు భయం లేదని అర్థమవుతుంది. మరోపక్క కఠిన శిక్షలు అమలు అవుతున్నా, ఉరి శిక్షలు విధిస్తున్నా అత్యాచారాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక అత్యాచారాలు జరిగాక విధించే శిక్షలు కఠినంగా అమలు చేయటంతో పాటు, అత్యాచారాలకు కారణాలు, మూలాలు అన్వేషించాల్సిన అవసరం వుంది. పాఠశాల విద్య నుండి విద్యార్థుల్లో నైతికత పెంపొందించేలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పు తీసుకు రాగలిగితే కొంతమేరకైనా ఈ అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ దారుణాలు ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది.