చెల్లిపై అన్నయ్య అఘాయిత్యం: వెక్కి... వెక్కి ఏడుస్తూ...
ఆమెకు అతడు వరుసకు అన్నయ్య అవుతాడు. ఆమెపై అతడు లైంగిక దాడి చేశాడు. కళాశాలలో చేరినప్పటి నుంచి ఆమె విచిత్రంగా (మానసిక వ్యాధిగ్రస్తురాలి మాదిరిగా) ప్రవర్తించసాగింది.
ఖమ్మం: బంధాలు, అనుబంధాల పవిత్రతను తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందేమోననిపించే అనైతిక, అవాంఛనీయ ఘటన ఇది. ఎప్పడు, ఎక్కడ, ఏం జరిగిందో.. ఆమె తల్లిదండ్రులు ఏం చెబుతున్నారో చదవండి.
ఆమెది మంచిర్యాల. కరీంనగర్ లోని ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. గత వేసవి సెలవుల్లో కొత్తగూడెంలోని సఫాయి బస్తీలో ఉంటున్న తన పెద్దమ్మ ఇంటికి వచ్చింది. కొత్తగూడెంలోని చాతకొండ ప్రాంతానికి చెందిన యువకుడు కర్ర అశోక్, ఆ ఇంటికి మే 5వ తేదీన వచ్చాడు. ఆ సమయంలో ఇంటిలో ఆ యువతి ఒక్కతే ఉంది. ఆమెకు అతడు వరుసకు అన్నయ్య అవుతాడు. ఆమెపై అతడు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఆమె తన పెద్దమ్మకుగానీ, మరెవరికిగానీ చెప్పలేదు. వేసవి సెలవుల తరువాత మంచిర్యాలలోని తన ఇంటికి వెళ్లిపోయింది. కరీంనగర్ లోని హాస్టల్ లో తల్లిదండ్రులు చేర్పించారు.
మనోవేదనతో.. మానసిక రోగిగా...
కళాశాలలో చేరినప్పటి నుంచి ఆమె విచిత్రంగా (మానసిక వ్యాధిగ్రస్తురాలి మాదిరిగా) ప్రవర్తించసాగింది. ఏదో పోగుట్టుకున్నదానిలో ముభావంగా ఉంటోంది. అందరిలోనూ కలవడం లేదు. స్నేహితురాళ్లు కలవరపడ్డారు. కళాశాల సిబ్బందితో చెప్పారు. వారు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆమె పరిస్థితిలో మార్పు లేదు. ఏం జరిగిందంటూ తల్లి ఎంత అడిగినా చెప్పలేదు. ఆ తల్లి బుజ్జగించింది, ధైర్యం చెప్పింది, ఏం జరిగినా.. తానున్నానంటూ అభయమిచ్చింది.
కొన్ని రోజుల తరువాత.. పెద్దమ్మ ఇంటిలో మే 5వ తేదీన తనపై 'అన్నయ్య' అశోక్ చేసిన అఘాయిత్యం చేసిన విషయాన్ని చెప్పలేక.. చెప్పలేక.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ నెల 16న చెప్పింది. ఆ తల్లి నెత్తిపై పిడుగు పడినట్టయింది. తట్టుకోలేని, భరించలేని మనోవేదనతో దాదాపుగా మానసిక రోగిలా మారిన తమ బిడ్డను ఊరడించారు. ధైర్యం చెప్పారు. మరుసటి రోజున ఆమెను తీసుకుని కొత్తగూడెం చేరుకున్నారు.
పంచాయితీ.. ఫిర్యాదు..
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషనుకు వెళితే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. స్థానిక రాజకీయ పార్టీ కార్యాలయంలో ఇరుపక్షాల పెద్దల మధ్య పంచాయితీ జరిగింది. అక్కడ కూడా ఆమెకు న్యాయం జరగలేదు. స్థానిక చర్చి పాస్టర్ స్వరాజ్యాన్ని సంప్రదించారు. వారికి ఆమె తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చింది.
స్పందించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలింపు
కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు కాస్తంత ఆలస్యంగానైనా స్పందించారు. వారిని శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషనుకు పిలిపించారు. రాత్రి వరకు అక్కడే ఉంచి, అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఆ తరువాత, మహిళా కానిస్టేబులును తోడుగా ఇచ్చి, వైద్య పరీక్షల కోసం ఆమెను ఆస్పత్రికి పంపించారు.
దాడి చేశాడు
ఆ యువతికి, ఆమె తల్లిదండ్రులకు ఆశ్రయమిచ్చిన పాస్టర్ స్వరాజ్యం భర్తపై కర్ర అశోక్, అతడి మిత్రుడు సునీల్ కలిసి దాడి చేశారు. ఇలా దాడి చేశారంటూ ఆయన ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషనుకు వెళితే పోలీసులు పట్టించుకోలేదు.కర్ర అశోక్ పై గురువారం అర్థరాత్రి 'లైంగిక దాడి' కేసును పోలీసులు నమోదు చేశారు.