దత్తాత్రేయ ఉండగా కెటిఆరా: షబ్బీర్, చీటింగ్ కేసు: దానం, సుప్రీం కోర్టులో ఎర్రబెల్లికి షాక్
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉండగా డబుల్ బెడ్ రూం శిలాఫలకం పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేరు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ శుక్రవారం నాడు నిలదీశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే డబుల్ బెడ్ రూం ఇళ్లను తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. దత్తాత్రేయ, మహమూద్ అలీ పేర్లు ఉండగా శిలాఫలకాలపై కేటిఆర్ పేరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూంల కోసం రూ.10వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.
మూడు రోజుల పాడు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరవు పైన కేంద్రాన్ని అడగక పోవడం విడ్డూరం అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత అజెండాతోనే కెసిఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. ఢిల్లీలో ఉండి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పక పోవడం విడ్డూరమన్నారు.
కొత్త బిచ్చగాళ్లలా ఉంది: దానం
మంత్రుల వ్యవహారం కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందంగా ఉందని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షులు దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన మండిపడ్డారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లను ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ఇస్తున్నారని ప్రశ్నించారు. లబ్ధి దారుల ఎంపికలో అన్యాయం జరిగితే చీటింగ్ కేసు పెడతామని హెచ్చరించారు. గతంలో చేసిన సోషల్ ఎకానమీ సర్వే ఏం చేశారన్నారు.
అనర్హత: సుప్రీం కోర్టులో ఎర్రబెల్లికి చుక్కెదురు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత విషయంలో ప్రస్తుతానికి తాము కల్పించుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తమ పార్టీకి, పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులను అనుభవిస్తున్నారని, తక్షణం వారి రాజీనామాలు ఆమోదించి, ఎన్నికలు జరిపించాలని కోరుతూ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు కోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం ధర్మాసనం దీనిని విచారించింది. ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలోనిదని ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
అయితే, మరో రెండు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే అప్పుడు మరోసారి తమ వద్దకు రావాలని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించి 14 నెలలు గడిచినా, స్పీకర్ స్పందించడం లేదని ఎర్రబెల్లి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.