"చార్మినార్ను కూడా కూల్చేస్తారా?', 'రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: వాస్తు పేరిట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రేపు చార్మినార్ను కూడా కూలగొడతారేమోనని కాంగ్రెస్ పార్టీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు.
సచివాలయాన్ని కూల్చివేసి, రూ.350 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదన్నారు. వాస్తు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు ఆయనకు లేదన్నారు. పాతబడిపోయిందని చార్మినార్నూ కూలుస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తన సొంత ఆస్తులకు వాస్తు చూయించుకోవాలని, బాగా లేకుంటే తన ఇల్లు కూల్చుకోవాలన్నారు. రైతుల కోసం జేఏసీ చైర్మన్ కోదండరాం ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీకి పావుగా మారుతున్నారనడం సరికాదన్నారు.
ఆసుపత్రిల పరిస్థితి బాగా లేదంటున్న ఎంపీ కవిత ఈ మాటలు మీడియా ముందు కాకుండా తన తండ్రి, సీఎం కేసీఆర్ వద్ద అంటే బాగుంటుందన్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక వంద కోట్ల కుంభకోణంగా మారిందన్నారు.
వాస్తు పేరుతో రూ.1200 కోట్ల ఖర్చు: రావుల
వాస్తు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. దేశంలో రాష్ట్రపతి భవన్ తర్వాత కేసీఆర్ నివాసమే పెద్దదని చెప్పారు. దేశంలోనే విలాసవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసలు సచివాలయంకు రాని కేసీఆర్కు వాస్తుతో పనేమిటన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా, కూతురు బతుకమ్మ ఆడుకోవడానికి ప్రజల డబ్బు ఇచ్చారన్నారు.