మందు, విందు: ప్రభుత్వ కార్యాలయాన్ని బార్గా మార్చిన ఉద్యోగులు
హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాన్ని దేవాలయాలుగా భావించాల్సిన ఉద్యోగులే దానిని బార్గా మార్చారు. చిత్తుగా మద్యం సేవించి మత్తులో మునిగి తేలారు. శుక్రవారం మధ్యాహ్నం షాద్నగర్ ట్రాన్స్కో కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఓ కాంట్రాక్టర్ శివతో కలిసి షాద్ నగర్ టౌన్ ఏఈ సురేష్ కార్యాలయ పనివేళ్లల్లో చిత్తుగా మద్యం సేవించారు. వీరితో పాటు షాద్నగర్ రూరల్ ఎఇ, కేశంపేట ఏఈలు కలిసి ఏకంగా మద్యం చిత్తుగా సేవించి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు.
ట్రాన్స్కో కార్యాలయం అవరణలోనే అధికారులు మద్యం మత్తులో మీడియాకు దొరకడంతో అక్కడికి వచ్చిన వారంతా విస్తుపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కార్యాలయానికి చేరుకొని దృశ్యాలను చిత్రీకరిస్తుండటంతో సదరు అధికారులు అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు.
మద్యం సేవిస్తూ నాన్వెజ్ను తింటూ అధికారులు మీడియాకు దొరకడం సంచలనంగా మారింది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పనివేళల్లో కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలను పట్టించుకోకుండా మద్యం సేవించడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు.
ట్రాన్స్కో ఆఫీసులో కాంట్రాక్టర్తో కలిసి ఏఈలు మద్యం సేవించిన విషయాన్ని షాద్నగర్ ట్రాన్స్కో ఎడి ఎం.నవీన్కుమార్ దృష్టికి తీసుకెళ్లగా విచారణకు ఆదేశించారు. పెండింగ్ బిల్లుల విషయమై తాను శుక్రవారం మధ్యాహ్నం కొత్తూరుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
తాను కొత్తూరుకు వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం అధికారులకు నివేదించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో ఎడి నవీన్కుమార్ తెలిపారు.