దక్షిణ రాష్టాలపై షా గురి..! టార్గెట్ గులాబీ..! సెప్టెంబర్ 17ను అస్త్రంగా మార్చుకోనున్న బీజేపి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల పేర్ల తో పాటు ఈశాన్య రాష్ట్రాల పేర్లు కూడా ఇప్పుడు అమీత్ షా 'టార్గెట్ బుక్' లోకి చేరిపోయాయి. అమిత్ షా బుక్ లోకి ఆ రాష్ట్రం పేరు చేరిపోయిందంటే అక్కడ బీజేపి జెండా పాతబోతున్నట్టు నిర్ధారణ అవుతోంది. తాజాగా కర్ణాటకలో జరిగిన పరిణామాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు త్రిపుర.. బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అమిత్ షా రాసుకున్న 'టార్గెట్ లిస్ట్'. ఇందులో, త్రిపుర.. బెంగాల్... కర్ణాటక రాష్ట్రాల్లో ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు, తెలంగాణపై దృష్టి సారించింది. ఆ పార్టీ కీలక నేత అమిత్ షా... కొన్నాళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నారు. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత విశ్రమించకుండా పని చేయటం ఒక ఎత్తు. ప్రత్యర్థులు విలవిలలాడేలా వ్యూహాలు పన్నటం మరో ఎత్తు. ఈ రెండింటిని సమపాళ్లలో రంగరించి రాజకీయ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంలో బీజేపీ ట్రాక్ రికార్డు చూస్తే కళ్లు చెదిరిపోక మానదు.
బెంగాల్... త్రిపుర... కర్ణాటక.. ఏపి.. తెలంగాణ..! ప్రస్తుతం అమీత్ షా టార్గెట్ ఈ రాష్ట్రాలే..!!
మోడీషాల కాంబినేషన్ లో ఇప్పటివరకూ తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో పాగా వేయలేని రాష్ట్రమంటూ ఏమీ లేదని చెప్పాలి. కాస్తో కూస్తో కొరుకుడుపడని రాష్ట్రంగా మిగిలిన పశ్చిమబెంగాల్ ను సైతం సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తామెలా క్రాక్ చేసిన విషయాన్ని చెప్పేశారు. తమిళనాడులో మోడీ-షా ద్వయం పప్పులు ఉడక్కపోయినా.. అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా తమ వ్యూహాన్ని మార్చుకొని.. తమ కనుసన్నల్లో అధికారపార్టీ నడిచేలా చేసుకోగలిగారు. ఇటీవల ఏపీ, తెలంగాణలను లక్ష్యంగా చేసుకున్న మోడీ-షాలు.. ముందుగా తెలంగాణ సంగతి చూడాలని నిర్ణయిండం తెలిసిందే. తాము విజయపతాకం ఎగురవేయాలని డిసైడ్ అయిన రాష్ట్రానికి తరచూ వెళ్లటం.. వివిధ కార్యక్రమాలు చేపట్టటం..అక్కడి క్యాడర్ లో మనోస్థైర్యాన్ని భారీగా పెంచి పార్టీ నేతలు పరుగులు తీసేలా చేయటంలో సిద్ధహస్తుడైన అమిత్ షా, ఇప్పుడు తెలంగాణలో అదే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. తాజాగా నిజామాబాద్ లో సెప్టెంబరు 17న నిర్వహించతలపెట్టిన సభ తెలంగాణ అధికారపక్షానికి ఒక పట్టాన మింగుడుపడని రీతిలో సాగుతుందని చెప్పక తప్పదు.
సెప్టెంబర్ 17th..! బీజేపీకి ఆయుధం కానుందా..!!
తెలంగాణ విమోచన దినోత్సవంపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్న వైఖరిపై తెలంగాణ సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మైనార్టీల మనోభావాలు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే చంద్రశేఖర్ రావు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించటం లేదన్న ఆరోపణ ఉంది. అయితే.. విమోచన దినోత్సవానికి మైనార్టీలకు లింకు పెట్టటం ద్వారా చంద్రశేఖర్ రావు పెద్ద తప్పు చేస్తున్నట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇదే చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమ వేళలో.. విమోచన దినోత్సవంపై చేసిన సానుకూల వ్యాఖ్యల్ని మర్చిపోకూడదు. ఉద్యమ వేళలో మాట్లాడిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న దానికి మధ్య వ్యత్యాసం కొన్ని వర్గాల వారికి అస్సలు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తోంది బీజేపీ.
తెలంగాణ విమోచన దినం పట్ల కేసీఆర్ చిన్న చూపు..! రగిలిపోతున్న బీజేపి..!!
జాతీయభావాన్ని రగిలించటంలో సిద్ధహస్తులైన కమలదళం తాజాగా నిర్వహించే సభ ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చంద్రశేఖర్ రావు సర్కారు అధికారికంగా ఎందుకు నిర్వహించలేకపోతోందన్న ప్రశ్నను సూటిగా సంధించం ద్వారా ఇరుకున పడేయాలని భావిస్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి సభలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రే స్వయంగా వస్తున్న నేపథ్యంలో ఈ సభకు అనుమతుల విషయంలో చంద్రశేఖర్ రావు సర్కారు మౌనంగా ఉండటం తప్పించి మరింకేమీ చేయలేదన్న మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో ఉన్న మోడీషాలు.. తెలంగాణలో తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా తెలంగాణ విమోచన దినోత్సవం లాంటి అంశాల్ని తెర మీదకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. భావోద్వేగంతో పాటు, సెంటిమెంట్ ను రగల్చటం ద్వారా తమదైన ఓటు బ్యాంకును పెంచుకోవటమే షా లక్ష్యంగా చెబుతున్నారు.
తెలంగాణ పై అమీత్ షా ఫోకస్..! సభ్యత్వం కూడా ఇక్కడనుండే..!!
దీనికి తోడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని క్రియాశీల సభ్యత్వాన్ని కూడా తెలంగాణ నుంచే తీసుకోవటం ద్వారా ఈ గడ్డకు తానెంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని అమిత్ షా చెప్పకనే చెప్పినట్లవుతుంది. కమలనాథుల ప్లాన్ తో చంద్రశేఖర్ రావు కు కొత్త ఇబ్బందులు తప్పవంటున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం వేళ నిజామాబాద్ లో నిర్వహించ తలపెట్టిన బీజేపీ సభ.. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణల్ని ప్రభావితం చేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి, గులాబీ బాస్ దీనికి చెక్ పెట్టేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో అన్న అంశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.