మాటల్లోనే పసిగట్టేయగలడు: మామూలోడు కాదు, చోరీ సొత్తునే కూతురి పెళ్లి కోసం..
హైదరాబాద్: ఆదిభట్ల పోలీసులకు చిక్కిన ఓ ఘరానా దొంగ నుంచి పోలీసులు ఆసక్తికర విషయాలు రాబట్టారు. నగరంలో చోరీ కేసులకు సంబంధించి ప్రధాన నిందితుడు శైలేంద్ర విశ్వకర్మ(36) సహా మరో ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.
నిందితులు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 18 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడైన శైలేంద్రను ఈ నెల 26న రిమాడ్ నుంచి ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.
కూతురి పెళ్లి కోసం:
శైలేంద్ర చోరీ చేసిన సొత్తులో చాలావరకు కూతురి పెళ్లి కోసం దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 220గ్రాముల బంగారాన్ని ఇంట్లో దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆదిభట్ల పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్ లోని అతని స్వగ్రామానికి తీసుకెళ్లి అతని ఇంట్లో దాచిన 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మన్నెగూడకు చెందిన సామ భీంరెడ్డి ఇంటి నుంచి ఈ బంగారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు.
9రాష్ట్రాల్లో 66కేసులు:
నిందితుడు శైలేంద్ర విశ్వకర్మ బీకాం చదవుకుని ఈజీ మనీ కోసం చోరీల బాట పట్టాడు. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి డబ్బులు లాక్కుని పరారైన ఘటనలో మధ్యప్రదేశ్ లో మొదటిసారి శైలేంద్ర పట్టుబడ్డాడు. అప్పటి నుంచి తన నేరాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. 2007నుంచి ఇప్పటి వరకు శైలేంద్రపై 9 రాష్ట్రాల్లో 66 కేసులు నమోదయ్యాయి.
ఇట్టే పసిగట్టేయగలడు:
ఎదుటి వ్యక్తిని మాటల్లో పట్టి అతని వ్యక్తిత్వాన్ని ఇట్టే కనిపెట్టేయగల నేర్పరి శైలేంద్ర. వారి గురించి ఓ అంచనాకు వచ్చిన తర్వాతే చోరీకి యత్నిస్తాడు. కుటుంబం తనతో పాటు ఉంటే దొరికిపోతానని జాగ్రత్తపడి.. వారిని మధ్యప్రదేశ్ లోనే ఉంచాడు. ఇక దొంగతనాలు ఎలా చేయాలన్న విషయాన్ని యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా నేర్చుకున్నాడు.
పీడీ యాక్ట్:
నిందితుడు శైలేంద్రపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శైలేంద్ర దొంగతనాల్లో శైలేంద్ర, పవన్, అనూప్లు కూడా కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం పవన్, అనూప్ పరారీలో ఉండగా.. ఇటీవల అరెస్ట్ చేసిన జాహిద్, సాజిద్, అర్చన కేవలం అతనికి సహాయకులుగానే వచ్చినట్లు తేల్చారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.