కాంగ్రెస్ తొలి జాబితాలో ఆ కొందరికి మొండిచేయా? కొత్తవారికి ఛాన్స్.. రేవంత్ వర్గం సక్సెసా?
Recommended Video
హైదరాబాద్ : రేపు మాపు అంటూ ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎట్టకేలకు విడుదల చేసిన తొలి జాబితా చర్చానీయాంశంగా మారింది. సీనియర్లలో కొందరికి మొండిచేయి మిగిలినట్లయింది. 65 మందితో కూడిన జాబితా విడుదల చేస్తే 2014 ఎన్నికల్లో పోటీచేసిన 32 మందికి ఫస్ట్ లిస్టులో చోటు లభించకపోవడం గమనార్హం. మరోవైపు భాగస్వామ్య పక్షాలు పట్టుబట్టిన కొన్నిస్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం కొసమెరుపు.
తొలిజాబితాలో ప్రకటించిన 65 మందిలో 22 మంది రెడ్డి కులస్తులకు, 39 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ముగ్గురు వెలమలకు, ఒక బ్రాహ్మణ నేతకు టికెట్లు ఖరారు చేసింది హైకమాండ్. బీసీల్లో 13 మందికి చోటు దక్కగా ఐదుగురు మున్నూరుకాపులు, నలుగురు గౌడ, పద్మశాలి, యాదవ కులానికి చెందినవారు ఒక్కొక్కరికి అవకాశం లభించింది. అయితే 10 మంది మహిళలకు టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ పెద్దలు ఫస్ట్ లిస్ట్ పై తమ మార్క్ చూపించారు. అయితే మిత్రపక్షాలతో కొలిక్కిరాని స్థానాలతో పాటు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను ఇంకా డిసైడ్ చేయలేదు. మరోవైపు ఓకే ఇంటి నుంచి రెండు సీట్లు దక్కినవారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, మల్లు రవి కుటుంబాలు ఉన్నాయి.
పొన్నాల, మర్రి, విష్ణుకు నో టికెట్.. రేవంత్ వర్గానికి ఓకే
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్ల పేర్లు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డికి చోటు దక్కకపోవడం గమనార్హం. పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీజేఎస్ కేటాయించే ఛాన్స్ ఉండటంతో ఫస్ట్ లిస్టులో దాన్ని ప్రకటించలేదు. ఇక రేవంత్ రెడ్డి వర్గం విషయానికొస్తే ఆయనతో సహా నలుగురికి తొలి జాబితాలో చోటు దక్కింది. పెద్దపల్లి నుంచి విజయరమణారావు, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, ములుగు నుంచి సీతక్కకు టికెట్లు ఖరారయ్యాయి.
65లో 32.. సగానికి సగం అభ్యర్థుల మార్పు
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ చూసినట్లయితే 65 స్థానాలకు గాను 32 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం జరిగింది. మరో ఇద్దరిని ఇతర స్థానాల్లో ఖరారు చేసింది. గతంలో సిర్పూర్ నుంచి పోటీచేసిన ప్రేమ్ సాగర్ రావుకు ఈసారి మంచిర్యాల కేటాయించగా, అంతకుముందు ములుగు నుంచి పోటీచేసిన పొడెం వీరయ్యకు ఈ ఎన్నికల్లో భద్రాచలం కేటాయించింది. చేయి వీడి కారెక్కిన నేతలు వినోద్ (చెన్నూరు), సురేశ్రెడ్డి (ఆర్మూరు), రెడ్యానాయక్ (డోర్నకల్), మాలోతు కవిత (మహబూబాబాద్), విఠల్రెడ్డి (ముథోల్), భానుప్రసాదరావు(పెద్దపల్లి), కాలె యాదయ్య (చేవెళ్ల), కె.దామోదర్రెడ్డి (నాగర్కర్నూల్) స్థానాల్లో ఇతరులకు టికెట్లిచ్చారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ఉన్నారు. మిగిలిన 24 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్ పెద్దలు పారాచూట్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం కల్పించారు.
కొత్త అభ్యర్థుల స్థానాలు ఇవే.. అలయెన్స్ పార్టీలు అడుగుతున్న స్థానాలోనూ..!
ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కంటోన్మెంట్, కొత్తగూడెం, కొడంగల్, నాగర్కర్నూలు, మునుగోడు, భువనగిరి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, ములుగు, భద్రాచలం, రామగుండం, స్టేషన్ ఘన్పూర్, సిర్పూర్, చెన్నూరు, మంచిర్యాల, ఆదిలాబాద్, ముధోల్, ఆర్మూరు, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, గజ్వేల్, చేవెళ్ల, తాండూరు.
కూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎస్, సీపీఐ పార్టీలు అడుగుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్పూర్, తాండూరు స్థానాలను టీజేఎస్ అడుగుతుండగా, కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, కొత్తగూడెం స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించారు. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తారని భావించిన నకిరేకల్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ప్రకటించింది హైకమాండ్.
మహిళలకు పెద్దపీటా? 10మందికి చోటు
మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ తొలిజాబితాలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మహిళలకు పెద్దపీట వేశామని చెప్పుకొనేలా 10 మందికి అవకాశం కల్పించింది. చేయి వీడి కారెక్కిన కొండా సురేఖ తిరిగి సొంతగూటికి చేరడంతో ఆమెకు ఫస్ట్ లిస్టులో బెర్త్ కన్ఫామ్ అయింది. గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సీతక్క, పద్మావతి, ఇందిర, ఆకుల లలిత, గండ్ర సుజాతకు ఫస్ట్ లిస్టులోనే టికట్లు ఖరారాయ్యాయి.