పెళ్లిళ్ల ముసుగులో దందా : అమ్మాయిల అక్రమ రవాణ..!
పాలమూరు : ఇండియాలో పేరుకుపోయిన పేదరికం పేదింటి బిడ్డల మాన ప్రాణాలను వేలానికి పెడుతోంది. అమాయక తల్లితండ్రులకు నోట్లు ఎరజూపి పెళ్లిళ్ల ముసుగులో ఈడుకొచ్చిన అమ్మాయిలను రేటు గట్టి మరీ కొనేస్తున్నారు కొంతమంది కామాంధులు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న శంషాబాద్ లో ఈ వ్యవహారం వెలుగుచూడడం గమనార్హం.
పాలమూరు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది రాజస్తాన్ వ్యక్తులు.. పెళ్లిళ్ల సాకుతో ఏళ్లుగా ఇక్కడి అమ్మాయిలను కొనుక్కెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక శంషాబాద్ లో శనివారం ఉదయం ఓ అమ్మాయిని రాజస్తాన్ కు తరలిస్తుండగా.. అనుమానం వచ్చిన స్థానికులు గట్టిగా నిలదీయగా అసలు నిజం బయటపడింది.
పాలమూరుకు రావడం.. తూతూమంత్రంగా పెళ్లిళ్లు కానిచ్చేయడం.. ఆ తర్వాత అమ్మాయిలను రాజస్తాన్ కు తరలించడం కొంతమంది రాజస్తాన్ వాసులు ఓ దందాగా మార్చుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పోలీసులకేమైనా ఫిర్యాదు అందిందా..? లేదా..? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.