కిరణ్ కుమార్ రెడ్డికి షాక్: 'అవినీతిపై బాబు-కెసీఆర్లకు లేఖ'
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
హైదరాబాద్: ఎర్ర చందనం కేసులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
ఎర్రచందనంలో వారి ప్రమేయం ఉందని తాను అప్పుడు కోర్టుకు వెళ్లడం వల్ల, తాను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నానో అందరికీ తెలుసునని చెప్పారు. నాడు గ్లోబల్ టెండర్లు పిలవకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
రూ.1,350 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించారన్నారు. ఇదే విషయమై తాను కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. మన న్యాయస్థానాలు బాగా పని చేస్తాయని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
ఇప్పుడు ఏపీకి ఎర్ర చందనం ప్రధాన ఆయుధంగా మారిందన్నారు. ఉమ్మడి ఏపీలో భారీ అక్రమాలు జరిగాయని, ఈ అంశంపై తాను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లకు లేఖ రాస్తానని చెప్పారు. తద్వారా ఆయన కిరణ్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు.