తెలంగాణ సచివాలయ నిర్మాణ కాంట్రాక్ట్ షాపూర్జీ పల్లోంజీ చేతికి: వ్యయం, గడువు ఎంతంటే?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త సచివాలయ భవన సముదాయానికి ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆస్కార్ అండ్ పొన్ని అర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులు చేసి సీఎం ఖరారు చేశారు.
రూ. 600 కోట్ల సచివాలయ నిర్మాణ టెండర్
ఆధునిక హంగులతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణ హితంగా కొత్త సచివాలయం ఉండనుంది. ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి గత నెలలో టెండర్లు ఆహ్వానించింది రోడ్లు భవనాల శాఖ. నిర్మాణ అంచనా వ్యయం రూ. 600 కోట్లతో టెండర్లు పిలిచింది. పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.
షాపూర్జీ పల్లోంజీ చేతికి నిర్మాణ పనులు
సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు టెండర్లు స్వీకరించింది. కాగా, బుధవారం కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు ఖరారు అయ్యాయి. ఆ టెండర్లని కమిషన్ ఆఫ్ టెండర్స్ ఖరారు చేసింది. కాగా, ఈ టెండర్ని షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.
Recommended Video
12 నెలలోపే తెలంగాణ సచివాలయ నిర్మాణం..
టెండర్లు ఖరారు అయిన నేపథ్యంలో ప్రభుత్వం, షాపూర్జీ-పల్లోంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ జరగనుంది. దాని ప్రకారం టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుంచి 12 నెలలోపు సచివాలయం కాంప్లెక్స్ను నిర్మించాల్సి ఉంటుంది. ఏ సమయం వరకు ఎంత పూర్తి కావాలో కూడా టార్గెట్ పెడతారు. ఈ దీపావళికి సెక్రటేరియట్ భవనాల నిర్మాణం ప్రారంభమైతే వచ్చే ఏడాది దసరా, దీపావళికి పూర్తయ్యే అవకాశాలుంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.