వలసలు నిజమే: పొంగులేటి, మళ్లీ షర్మిల పరామర్శ
హైదరాబాద్: తమ పార్టీ నుంచి నాయకులు వలసలు వెళ్తున్న మాట నిజమేనని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అంగీకరించారు. ఈ విషయంపై తాము సమీక్ష చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
గురువారం జరిగిన పార్టీ తెలంగాణ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తాము తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వలసలను ప్రోత్సహించడం సరి కాదని ఆయన అన్నారు.
వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల తిరిగి తెలంగాణలో పరామర్శ యాత్రను చేపట్టనున్నారు. ఆమె పర్యటన వివరాలను శ్రీనివాస రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 21వ తేదీనుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మృతితో దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
ఏడు రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. మిగిలిన కుటుంబాలను ఫిబ్రవరిలో పరామర్సిస్తారు. వరంగల్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ పార్టీ నాయకుడు భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని ఈ నెల 12వ తేదీన వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. వైయస్ షర్మిల ఇంతకు ముందు మహబూబ్నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేసిన విషయం తెలిసిందే.