పోకిరిల తోకలు కత్తిరించిన షీ టీమ్ : కటకటాల్లోకి 23 మంది
హైదరాబాద్ : నగరంలో మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల భరతం పడుతున్నాయి షీ-టీమ్స్. బాధితుల ఫిర్యాదుతో తక్షణమే స్పందిస్తోన్న షీ టీమ్ బృందాలు పక్కా ప్లాన్ తో నిందితుల ఆట కట్టిస్తున్నాయి. తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్న 23 మంది ఆకతాయిలను షీ-టీమ్ అరెస్టు చేసింది. ఇందులో 14 మంది మైనర్లు ఉండడం గమనార్హం.
పేరుకే టీచర్.. వేధించడమే పని :
తాజాగా షీ-టీమ్ బృందాలకు చిక్కిన వ్యక్తుల్లో చాంద్రాయణ గుట్టకు చెందిన ఓ టీచర్ కూడా పట్టుబడ్డాడు. పాఠాలు బోధించాల్సింది పోయి ఫోన్ ద్వారా విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్న అతగాడిని షీ టీమ్ అరెస్టు చేసింది.
కాగా, విషయం ఎలా వెలుగు చూసిందంటే.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉండే ఓ ఎనిమిదో తరగతి బాలిక సీక్రెట్ గా ఎవరికో మెసేజ్ లు పంపిస్తుండడాన్ని కనిపెట్టింది ఆమె సోదరి. దీంతో విషయం తల్లిదండ్రులకు చెప్పగా బాలికను ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.
తాను చదువుకుంటున్న పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న ఎన్.విజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు, ఇంటికెళ్లాక రోజు తనకు మెసేజ్ లు చేయాల్సిందిగా వేధిస్తున్నాడని, అందుకే తాను రహస్యంగా అతడికి మెసేజ్ లు చేస్తున్నానని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు షీ-టీమ్ కు ఫిర్యాదు చేయగా, స్పందించిన షీ టీమ్ సదరు టీచర్ పట్టుకుని కటకటాల్లోకి నెట్టింది.
ఎన్.రెడ్డి కిరణ్
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఈ పోకిరి పేరు ఎన్.రెడ్డి కిరణ్. ఆయా సర్వీస్ ప్రొవైడర్స్ కు సంబంధించిన సిమ్ కార్డులు విక్రయించడం ఇతడి వ్యాపారం. అయితే దీన్నే ఆసరాగా చేసుకుని సిమ్ కార్డుల దుర్వినియోగానికి పాల్పడ్డ కిరణ్, నచ్చిన సిమ్ ను మొబైల్ లో వేసుకుని మహిళలను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకర మెసేజ్ లు, ఫోన్లు చేస్తూ మహిళలను వేధించాడు. అయితే కొంతమంది మహిళలు షీ టీమ్ లకు షిర్యాదు చేయడంతో కిరణ్ పోకిరి వేషాలకు బ్రేక్ పడింది.
రమేశ్
ఈ ఫోటోలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు రమేశ్.. ఇతను కిరణ్ కు స్నేహితుడు. ఇతనిది కూడా కిరణ్ లాంటి వ్యవహారమే. కిరణ్ కు స్నేహితుడు కావడం.. కిరణ్ తో పాటే సిమ్ కార్డులు విక్రయించే పనిచేస్తుండడంతో సిమ్ కార్డులను విచ్చలవిడిగా వాడుతూ.. మహిళలను వేధించుకు తినడం మొదలుపెట్టాడు. చివరికి షీ టీమ్ కు చిక్కడంతో జైళ్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి.
మహమ్మద్ సలీముద్దీన్
నగరంలోని యాకుత్ పురాకు చెందిన ఇతని పేరు మహమ్మద్ సలీముద్దీన్. చేసేది టైలరింగ్, కానీ బుద్ది గడ్డి తిని ఓ స్థానిక మహిళను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె భార్య, కొడుకు పలుమార్లు హెచ్చరించినా.. సలీముద్దీన్ లో మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన మహిళ కుటుంబం షీ టీమ్ కు విషయాన్ని చేరవేసింది. ఇంకేముంది రంగంలోకి దిగిన టీమ్స్ పట్టుకెళ్లి లోపలేశాయి.
జె.సంగప్ప
ఇక ఇతగాడి పేరు జె.సంగప్ప. దారెంబడి నిమ్మకాయ సోడాలు అమ్ముకోవడం ఇతడు చేసే పని. అయితే పనిమీద ఉండాల్సిన దృష్టి కాస్త పక్క నుండి వెళ్లే అమ్మాయిల మీద పడి, ఓ ఎనిమిదో తరగతి అమ్మాయిని వేధించడం పనిగా పెట్టుకున్నాడు. వెంటపడొద్దని బాలిక ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సంగప్ప తీరులో మార్పు రాలేదు. చివరికి విషయం షీ-టీమ్స్ దృష్టికి వెళ్లడంతో అరెస్టు అయి జైళ్లో కూర్చొన్నాడు.