‘షీ’ టీమ్స్కు ఏడాది, వేధింపులు తగ్గాయి: వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్న స్వాతి లక్రా
హైదరాబాద్: మహిళలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని హైదరాబాద్ అదనపు క్రైమ్ పోలీసు కమిషనర్ స్వాతిలక్రా అన్నారు. షీ టీమ్స్ ఏర్పాటుచేసి అక్టోబర్ 24కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.
షీ బృందాల బాధ్యత మరింత పెరిగిందని... ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. ఏడాదిలో షీ టీమ్స్కు 883 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 281 ఆకతాయిలను పట్టుకుని 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 19 మందికి జైలుశిక్ష, 101 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు.
డయల్ 100 ద్వారా 575, ఫేస్బుక్ ద్వారా 196 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. షీ టీమ్స్ వల్ల మహిళలపై వేధింపులు తగ్గాయని స్వాతి లక్రా తెలిపారు. ఎవరు వేధించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
షీ టీమ్స్పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 100 కళాశాలలు, 70 పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. సోషల్ సైట్లలో యువతులను వేధించిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.