మేం కనిపిస్తే అమ్మాయిలు మీకు ఫోన్ చేస్తున్నారు: ఉబ్బితబ్బిబ్బు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే చాలు.. షీ టీమ్స్కు ఫోన్లు వెళ్తున్నాయని, దీంతో టీజింగ్ కేసులు తగ్గాయి. హైదరాబాదులో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిజాన్ని అకతాయిలే సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్లో చెప్పడంతో అధికారులు ఉబ్బితబ్బిబవుతున్నారు.
ఎవరైనా తమ వైపు అదోలా చూడటం, వేధించడం చేస్తే... షీ టీమ్స్కు ఫోన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆకతాయిలు పరుగులు పెడుతున్నారు. ఈ విషయాన్ని కౌన్సెలింగులో అధికారులకు ఈవ్ టీజర్స్ వెల్లడించారు.
షీ టీమ్స్ పట్ల అందరికీ అవగాహన పెరగడం మంచి పరిణామమని పోలీసులు చెబుతున్నారు. మహిళలో పెరిగిన ఈ చైతన్యంతో ఇటీవల కేసుల సంఖ్య చాలా తగ్గిందని సైబరాబాద్ షీ టీమ్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రముఖ తెలుగు దినపత్రికతో చెప్పారు.
గతంలో ప్రతి వారం 50 నుంచి 60 ఈవ్ టీజింగ్ కేసులు నమోదైయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా తగ్గి వారానికి 15 కేసుల వరకు తగ్గాయని తెలుస్తోంది. ఇటీవల ఈ కేసులలో జైలు శిక్షలు పడుతుండడం కూడా ఈవ్ టీజర్లలో భయాందోళన రేపుతుందని పోలీసులు భావిస్తున్నారు.
రెండు వారాల్లో నమోదైన 32 కేసులలో పట్టబడిని వారిలో ఇద్దరు 65 సంవత్సారలు దాటిన సీనియర్ సిటిజన్లు ఉండగా మిగతా వారంతా 30 సంవత్సరాలు దాటిన ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారని పోలీసులు చెప్పారు. షీ టీమ్స్ ప్రచారంలో భాగంగా మరికొన్ని కొత్త కార్యక్రమాలతో ఈవ్ టీజింగ్ నివారణకు మహిళలు, యువతుల్లో అవగాహనను కల్పిస్తామన్నారు. శనివారం పట్టుబడ్డ ఈవ్ టీజర్లకు షీ టీమ్స్ కౌన్సెలింగ్ చేశారు.