విషాదం: ప్రమాదంలో యువతి జీవన్మృతి, బాధలోను పేరెంట్స్ అవయవదానం
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో బైక్ పైన వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి, ఓ యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆ యువతిని డాక్టర్లు జీవన్మృతిగా ప్రకటించారు. అంత బాధలోను తల్లిదండ్రులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన యువతి ఎస్సార్ నగర్లోని మహిళల హాస్టల్లో ఉంటోంది. పంజాగుట్టలో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
ఈ సంస్థ యజమాని మేనల్లుడితో ఆ యువతికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి మూసాపేటలోని ఓ హోటల్కు వెళ్లారు. బుధవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి బైక్పై వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన బైక్
ఎర్రగడ్డలోని ఓ ఆసుపత్రి వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్.. అక్కడ ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. యువకుడి తలకు హెల్మెట్ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ యువతి తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను సమీపంలోని సెయింట్ థెరిసా ఆసుపత్రికి తరలించారు.
అవయవదానంకు ముందుకొచ్చిన పేరెంట్స్
మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె జీవన్మృతి (బ్రెయిన్ డెడ్) చెందినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు అంత ఆవేదనలోను తమ కూతురు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
పేరెంట్స్ ఫిర్యాదు
ఆమెతో పాటు ఉన్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అంతకుముందు రోజే ఆమె తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిందట.