ప్రజాస్వామిక వాదులు పారా హుషార్: నయా ‘నయీం’ శేషన్న హియర్?
హక్కుల సంఘాల నేతలు మొదలు.. బడా వ్యాపారవేత్తల నుంచి.. విపక్ష నేతలు పలు ప్రజాసంఘాల ప్రముఖులు మొదలు సామాన్యుని వరకు వేల మందికి కొంత 'ఊరట' కలిగించిన వార్త గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్!
హైదరాబాద్: హక్కుల సంఘాల నేతలు మొదలు.. బడా వ్యాపారవేత్తల నుంచి.. విపక్ష నేతలు పలు ప్రజాసంఘాల ప్రముఖులు మొదలు సామాన్యుని వరకు వేల మందికి కొంత 'ఊరట' కలిగించిన వార్త గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్! ఎవరు అంగీకరించినా.. అంగీకరించకున్నా ఎంతో కొంత వాస్తవమది!!
అది మూణ్నాళ్ల ముచ్చటేనా? ఆ కేసులో 'ఎవ్వరినీ వదలం.. అంతు చూసి తీరుతాం.. శాంతి భద్రతలను కాపాడతాం. రాజీ పడం. మా సత్తా ఏందో చూపిస్తాం..' అని చట్టసభల సాక్షికంగా ఏలికలు చేసిన గంభీర ప్రకటనలు ఉత్త మాటలేనా? నిర్భీతిగా.. నిర్మాణాత్మక విమర్శలు చేసే ప్రజాస్వామిక గొంతులు.. వచ్చే ఎన్నికల నాటికి మూగబోక తప్పదా? ఏలికలు అంత సులభంగా 'నల్లదండు'ను వదిలించుకుంటారా? అలా ఎవరైనా ఆశిస్తే.. పాపం, వారికి నిరాశే!
ఇప్పటిదాకా నయీం యాక్షన్ టీమ్ నుంచి చురుకైన ఒక్క సభ్యుడ్ని కూడా పోలీసులు పట్టుకున్న దాఖలా లేదు. అంత పెద్ద గ్యాంగ్స్టర్నే పట్టుకున్న యంత్రాంగానికి ఆయన అనుచరులను పట్టుకోవడం పెద్ద సుతారమా? కానే కాదు కదా?! ఆ యంత్రాంగం అండదండలతోనే భవిష్యత్లో శేషన్న విజృంభణ ఆట ఆడబోతున్నారా?! అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన విస్తుగొలిపే విషయాలు ఇవి అంటూ ఓ తెలుగు దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. ఒక భార్యను ఎల్బీనగర్లో, మరో భార్యను సంతోష్నగర్లో ఉంచారు. ఆయా ప్రాంతాల్లో 55 ఏండ్ల శేషన్న వీధుల్లో సిగరెట్ కాలుస్తూ తిరుగుతుంటారట కూడా! ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఈ సంచలన వార్తాకథనాన్ని ప్రచురించింది.
నయీం తర్వాతీ స్థానంలో శేషన్న
నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత 'నెంబర్-2' శేషన్న కోసం అన్వేషణ అంటూ ఎన్నో వార్తలు వెలువడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన బేషుగ్గా హైదరాబాద్లోనే సంచరిస్తున్నాడు. అదీ.. తన ఇద్దరు భార్యలతో కలిసి మరీ!! కొద్ది రోజుల క్రితం నాగోల్లో జరిగిన అచ్చంపేటకు చెందిన ఒక వ్యాపారి కుటుంబ ఉత్సవంలో బహిరంగ దర్శనమిచ్చాడు. అచ్చు నయీంను తలపించేలా గుర్తుకు వచ్చేలా ఆయన కాన్వాయ్ ఆ కార్యక్రమానికి హాజరైంది. స్కార్పియో వాహనంలో వచ్చిన శేషన్నను..అనుచర వర్గంతో కూడిన ఎండీవర్, సుమోలు అనుసరించాయి. అందరూ షార్ట్ వెపన్స్తో 'బాజాప్తా'గా ఆ కార్యక్రమానికి హాజరై వెళ్లారు.
అచ్చం నయీమ్ స్టయిల్లో భాగ్యనగరి టూ నల్లమల
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా.. ఉమ్మడి మహబూబ్నగర్.. కర్నూల్ జిల్లాల పరిధిలో తన కార్యకలాపాలను ఆయన నిర్వహిస్తున్నాడు. నయీం వద్ద పనిచేసిన యాక్షన్ టీమ్ మొత్తం శేషన్న కనుసన్నల్లోనే ఉంది. ఆయన ఒక కను సైగ చేస్తేచాలు.. వారు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా! గతంలో భువనగిరి కేంద్రంగా ఒక ఊపు ఊపిన నయీం.. తనకు సమాచారం చేరవేసే సుమారు వంద మంది యువకులకు ఏటేటా కొత్త బైక్లు.. గోల్డ్ చెయిన్లు నజరానాగా అందించేవాడు. సరిగ్గా అదే సంప్రదాయం కొనసాగింపుగా అన్నట్టు.. రెండు వారాల కిందట సుమారు 20 మందికి శేషన్న అదే రీతిలో నజరానాలు అందించడం విశేషం!
నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఇద్దరు కరడుగట్టిన నేరగాళ్లు ప్రస్తుతం శేషన్నకు కుడి-ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక 'పెద్ద' నేతలు ఒకనాడు నయీంతో ఎలా అంటకాగినట్లే అదే పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి శేషన్నతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. అదే జిల్లాకు చెందిన విపక్ష కాంగ్రెస్కు చెందిన మరో ఛోటా నేత సైతం వారితో ఊరేగుతున్నారు. ఈ తరహా నేతలు చేసే పనల్లా.. ముఠాలకు, యంత్రాగానికి మధ్య అనధికార 'వారధి'లా వ్యవహరించడమే! యంత్రాంగం ముఠా నేతను కాదనుకున్న నాడు.. వీరికి వచ్చే ముప్పేం ఉండదు కూడా! నయీం ఉదంతం నిరూపించిన వాస్తవం కూడా అదే కదా!?
కిల్లింగ్ స్పెషలిస్ట్.. మాస్టర్ మైండ్
నాటి పీపుల్స్వార్ మాజీ కార్యదర్శి సాంబశివుడు (కోనాపురి ఐలయ్య), ఆయన సోదరుడు రాములు.. పరిటాల రవి హత్య కేసుతో పాటు కొన్ని వందల కేసుల్లో నిందితుడైన ముఠానేత పట్లోళ్ల గోవర్దన్రెడ్దిని హత్య చేయడంలో 'మాస్టర్ మైండ్' శేషన్నే అని వార్తలు వెలువడ్డాయి. దాంతో నయీమ్ బతికి ఉన్నప్పుడే ఆయనకు ప్రత్యమ్నాయ నేతగా బయట ప్రపంచంలో గుర్తింపు పొందాడు. నిజానికి వెలుగు చూడని 'అర్ద శతకం' హత్యలు ఆయన ఖాతాలో ఉన్నాయట! తన చేతిలో హతమైన వారి శవం కూడా లభించనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రపంచంలో నెంబర్ వన్ శేషన్నేనట!!
భాగ్యనగరిలో ఇలా శేషన్న సామ్రాజ్యం
నయీం హత్యానంతర 'శాంతి కాలం'లో రాజధానిలో పలు ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో.. బార్ అండ్ రెస్టారెంట్లలో.. రియల్ ఎస్టేట్ రంగంలో శేషన్న భారీ పెట్టుబడులు పెట్టి ఆర్థిక సుస్థిరతకు ముందు జాగ్రత్తలు తీసుకున్నాడని ఆ వర్గాలు వెల్లడించాయి. అంతేనా? ప్రస్తుతం ఏకంగా మియాపూర్ ప్రాంతంలో పెద్ద బ్రాండ్ పేరిట ఉన్న అపెరల్ షోరూమ్లోనే తన సొంత 'ఆఫీస్' ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం! సో.. పార్టీలేవైనా.. పాలకులంతా బంధువులే!! నల్లదండ్లకు వారి ఆశీస్సులు దండిగానే ఉంటాయి. అందుకే ప్రజాస్వామికవాదులూ.. జర హుషార్!!