శ్రీనగర్ నిట్: తెలుగు విద్యార్థుల ఆందోళన, బాధ్యత మాదేనని ముఫ్తీ
శ్రీనగర్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. నిట్ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని తెలిపారు. నిట్ ను శ్రీనగర్ నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశారు.
నిట్ నుంచి వెళ్లిన ఇతర రాష్ట్రాల విద్యార్థులు తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు ముఫ్తీ తెలిపారు. స్థానికులు, స్థానికేతరులు అనే సమస్యే లేదు, అందరికీ రక్షణ కల్పిస్తామని ముఫ్తీ చెప్పారు.
కాగా, నిట్ ఘటన, జమ్మూకాశ్మీర్ సమస్యలపై ముఫ్తీతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చర్చలు జరిపారు. సున్నితమైన అంశాలతో రాజకీయ పార్టీలు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కాశ్మీర్ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉందని అన్నారు.
దీన్ని లోకల్, నాన్ లోకల్ సమస్యగా చూడకూడదని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మానవ వనరుల శాఖ దృష్టి సారించిందని చెప్పారు. తెలుగు విద్యార్థులే కాదు, అందరూ భారత విద్యార్థులేనన్న ఆయన.. అందరి రక్షణ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
జంతర్ మంతర్ దగ్గర తెలుగు విద్యార్థుల ధర్నా
శ్రీనగర్ నిట్ నుంచి తమను వేరే నిట్కు తరలించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. శ్రీనగర్ నిట్లో తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని, అక్కడ ప్రశాంతంగా చదువుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.