శిరీష స్పందించింది..కానీ ఇప్పుడే వివరాలు చెప్పలేం: 'మంథని' ఘటనపై ఏసీపీ
శిరీషను విచారించి పలు వివరాలు సేకరించామని, అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని ఏసీపీ సింధు శర్మ తెలిపారు.
పెద్దపల్లి: సోషల్ మీడియా ఉద్యమంతో మంథని మధుకర్ అనుమానస్పద మృతి కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దళిత, ప్రజాస్వామిక సంఘాల మెరుపు ధర్నాతో దిగొచ్చిన పోలీసులు పునర్విచారణకు ఒప్పుకోగా.. హైకోర్టు ఆధ్వర్యంలో నేడు మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు.
ఛలో మంథని: కులోన్మాదానికి బలైన 'మధుకర్' పాశవిక హత్యను నిరసిస్తూ..
మరోవైపు మధుకర్ ప్రేమించిన యువతి శిరీషను ఇంతవరకు మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడం, ఆమెను విచారించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న ఏసీపీ సింధు శర్మ దీనిపై స్పందించారు. శిరీషను విచారించి పలు వివరాలు సేకరించామని, అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని తెలిపారు.
కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి ఫోన్ కాల్ డేటా వివరాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే, మధుకర్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరీష కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు నేడు మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ జరగనుంది. కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో కుటుంబ సభ్యుల, పలువురు దళిత సంఘాల సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్ బృందం రీపోస్టుమార్టం నిర్వహించనున్నాయి. అనంతరం నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించనున్నారు.