కుటుంబాన్నే లేపేద్దామనుకున్నా: దొంగ బాబా, సినీ డైరెక్టర్కూ టోకరా
హైదరాబాద్: మోసం చేసి, డబ్బు దొంగిలించుకుని పోదామని అనుకున్న తనకు పెద్ద మొత్తంలో డబ్బు కనిపించేసరికి లైఫ్స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలని అనుకున్నట్లు దొంగ బాబా శివానంద పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే మధుసూదన్ రెడ్డి కుటుంబానికి ప్రసాదం పేరిట ఇచ్చిన పరమాన్నంలో నిద్ర మాత్రలతోపాటు ఉమ్మెత్త గింజలు, సీసం కూడా కలిపినట్లు చెప్పాడు.
దొంగ బాబా చెప్పిన విషయాలను విని పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం- పూజలో కూర్చున్న తర్వాత పది, 20 లక్షలు పెడతారని భావించానని, కానీ, ఒక్కసారిగా రూ.1.33 కోట్లు కనిపించడంతో డబ్బుపై ఆశ పెరిగిపోయిందని చెప్పాడు. దానిని ఎలాగైనా కాజేయాలని, అందుకు అవసరమైతే మధుసూదన్రెడ్డి కుటుంబాన్ని హతమార్చడానికి సిద్ధమయ్యానని తెలిపాడు.
దొంగ బాబాపై పోలీసులు చీటింగ్ కేసుతోపాటు హత్యా యత్నం కింద కేసు నమోదు చేశారు. ఏకంగా మూడు గంటలపాటు మంత్రాలు చదవడానికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పాడు. వచ్చీ రాని మంత్రాలు చదువుతూ కాలక్షేపం చేశానని, ఆ తర్వాత డబ్బు తెచ్చి పెట్టాలని కోరానని తెలిపాడు. మధుసూదన్ రెడ్డి లక్షన్నర తీసుకొచ్చి పూజలో పెట్టాడని, తన వద్ద ఉన్న డబ్బును కలిపి దానిని రెట్టింపు చేయడంతో అతడి కుటుంబానికి నమ్మకం కలిగిందని తెలిపాడు.
దాంతో, మరింత ఎక్కువ మొత్తంలో డబ్బు పెడితే ఈసారి ఐదింతలు చేస్తానని చెప్పానని, భారీగా డబ్బు సంచి రావడంతో మనసులోనే ఆనందించానని శివానంద చెప్పాడు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఐదు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకుంటే, ఇక తనకు తిరుగులేదని దొంగ బాబా భావించాడు. అయితే, అతడు బస చేసిన హోటల్ గదిలో మరచిపోయిన డ్రైవింగ్ లైసెన్స్, సెల్ఫోన్ సిగ్నల్స్ తనను పట్టిస్తాయని గ్రహించలేకపోయాడు. హోటల్ నుంచి దామోదర్, శ్రీనివాస్ రెడ్డిలకు ఫోన్ చేశాడు. తాను డబ్బు పట్టుకొని వస్తున్నట్టు చెప్పాడు. సెల్ స్విచ్ఛాఫ్ చేశాడు. మరో రెండు సెల్ఫోన్లను ఆన్లో ఉంచాడు.
పారిపోయే హడావుడిలో బస చేసిన హోటల్లో డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయాడు. పోలీసులు తనిఖీల్లో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిపై బెంగళూరు చిరునామా ఉండటంతో పోలీసు బృందం అక్కడకు చేరింది. అలాగే, హోటల్ నుంచి పారిపోయిన సమయంలో బురిడీ బాబా ఫోన్ కాల్ను పరిశీలించారు.
దామోదర్, శ్రీనివాలరెడ్డి నెంబర్లు ఉండటంతో వారిని వల వేసి పట్టుకున్నారు. విచారణలో వారు శివ కు చెందిన మిగతా ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వాటి సిగ్నల్స్ ఆధారంగా బెంగళూరులోని ఇందిరానగర్లో తన ఇంట్లో ఉన్న శివను పట్టుకున్నారు.
ప్లాప్ డైరెక్టర్కూ షాక్
నిరుడు హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖుడు పలువురు వ్యాపారులు, సినీరంగ ప్రముఖులను బురిడీ బాబాకు పరిచయం చేసినట్లు సమాచారం. దీన్ని అవకాశంగా మలచుకున్న శివ మూడు నెలలుగా పలుచోట్ల పూజలు నిర్వహిస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు సాగించాడు.
అతని మాయ మాటలకు ఓ సినీ డైరెక్టర్ కూడా చిక్కినట్లు వార్తలు వచ్చాయి. కొద్దికాలంగా ప్లాప్లతో ఉన్న దర్శకుడు స్వయంగా సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి కావాల్సిన సొమ్ము కోసం గాలిస్తున్నాడు. ఈ సమయంలో స్నేహితుడు పరిచయం చేసిన బాబా ద్వారా విజయం సాధించాలని అనుకున్నాడు.
తనపై నమ్మకం కలిగించేందుకు శివ డెమో ద్వారా కనికట్టు చేసేవాడు. లుంగీ, రబ్బర్ బ్యాండ్లు, పువ్వులు ఉంటే చాలు.. డెమో ఇచ్చేసేవాడు. తాను ధరించిన లుంగీని సగం వరకూ కట్టేవాడు. దాన్నే కిందపరచి వారు ఇచ్చిన డబ్బును ఉంచమనేవాడు. తాను ముందుగా సిద్ధం చేసుకున్న డబ్బును రబ్బర్ బ్యాండ్స్ సాయంతో తొడల వద్ద భద్రపరచుకునేవాడు. డెమో సమయంలో వారి దృష్టి మళ్లించి తన వద్ద ఉన్న డబ్బు కలిపేసేవాడు. డబ్బులు డబుల్ అయినట్లు నమ్మకం కలిగించేవాడు. దీంతో పూజకు ఆహ్వానించిన వ్యక్తులు అది నిజమని భావించేవారు.