కేసీఆర్ పాలన చూసి ఆశ్చర్యపోయా: శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్పై కవిత
నిజామాబాద్/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణలో ఆంధ్రా పాలన వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం చెప్పారు. ఆమె ఆర్మూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జీవన్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణలో సంక్షేమం ఆగిపోకుండా ఉండాలంటే తెరాస పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పారు. తెరాస అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరి కళ్ల ముందే ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ ఇంటి పాలన చూసి ఆశ్చర్యపోయా: శివరాజ్ సింగ్
ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు సంక్షోభంలో పడిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం నిప్పులు చెరిగారు. తాను 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సచివాలయం నుంచి పాలించానని ఆయన చెప్పారు. కానీ ఇక్కడి ముఖ్యమంత్రి (కేసీఆర్) పాలనను ఇంట్లో నుంచి చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మళ్లీ బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పారు.