కేసీఆర్కు హైకోర్టు షాక్: కోమటిరెడ్డి-సంపత్ల సభ్యత్వం రద్దు చెల్లదు, వారు ఎమ్మెల్యేలే, గెజిట్ రద్దు
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లకు హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. వారి శాసన సభ్యత్వాల రద్దు చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. వారిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పు ద్వారా హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి, సంపత్లకు పెద్ద ఊరట లభించింది. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని, గతంలో ఉన్న బెనిఫిట్స్ వర్తింప చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను రద్దు చేసింది.
కాగా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్పై హెడ్ఫోన్స్ విసిరి దాడి చేసిన అంశంలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వం మార్చి 14న రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్లకు హైకోర్టులో తాత్కాలిక ఊరట
ఈ సందర్భంగా మార్చి 19న హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆయా నేతల నియోజకవర్గాలైన నల్గొండ, అలంపూర్ ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వొద్దని చెప్పింది. కనీసం ఆరు వారాల వరకు ఆగాలని సూచించింది. అనంతరం ఇప్పుడు ప్రభుత్వానికి షాకిచ్చే తీర్పు వచ్చింది.
వివరణ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తారా?: లాయర్
ఒకవేళ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వారి వివరణ తీసుకోవాలని, కానీ వివరణ తీసుకోకుండా ఒక్కసారిగా శాసన సభ్యత్వాల రద్దు సరికాదని హైకోర్టు చెప్పిందని వారి తరఫు న్యాయవాది చెప్పారు. అసలు లోపల ఏం జరిగిందో వీడియో చూపించమంటే చూపించలేదని లాయర్ అన్నారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్లు ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు అని, వారు యథేచ్చగా అసెంబ్లీలోకి వెళ్లవచ్చునని చెప్పారు. వారిపై ఉన్న శాసన సభ్యత్వాల రద్దును హైకోర్టు ఎత్తివేసిందన్నారు. కోర్టు గెజిట్ నోట్ను రద్దు చేసిందని లాయర్ చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆర్డర్ను కూడా రద్దు చేసిందన్నారు.
సంపత్ గారి మీద, వెంకట్ రెడ్డి గారి మీద శాసన సభ్యత్వాల రద్దును ఎత్తివేసినట్లు, గెజిట్ రద్దు చేసినట్లు, వారు ఈ క్షణం నుంచి ఎమ్మెల్యేలుగానే పరిగణించబడుతారని కోర్టు చెప్పిందన్నారు. ప్రతి అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుందని చెప్పారు. సంతకం పెట్టినప్పటి నుంచే వారు ఎమ్మెల్యేలు అని, దానికి స్పీకర్ అనుమతి అవసరం లేదన్నారు. ఈ నెల రోజుల పాటు వారు కోల్పోయిన బెనిఫిట్స్ కూడా తిరిగి ఇస్తారని చెప్పారు.
ధర్మం మావైపు నిలిచింది: పొంగులేటి
సంపత్ కుమార్, కోమటిరెడ్డిల శాసన సభ్యత్వాల అంశంపై హైకోర్టు తీర్పునుకాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వాగతించారు. ధర్మం తమ వైపు నిలిచిందన్నారు.