కేసీఆర్కు ఊహించని షాక్: టీఆర్ఎస్కు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుడ్బై, 5 కారణాలు
చేవెళ్ల: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భారీ షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాసకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు.
మంత్రితో ఆధిపత్య పోరు
చేవెళ్లలో విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేశ్వర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన తెరాసకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి మహేందర్ రెడ్డికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అలకబూనారు. నాలుగు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడారు. కానీ సద్దుమణగలేదు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతారా?
ఈ నెల 23వ తేదీన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీల బహిరంగ సభ తెలంగాణలో ఉంది. ఈ సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పుడే చేరుతారా లేక ఎన్నికల వరకు వేచి చూస్తారా చూడాల్సి ఉంది.
ఎంపీ పదవికి కూడా రాజీనామా?
తనకు ప్రాధాన్యత ఉండటం లేదని తెరాసకు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఆయనను పార్టీ నేతలు కేటీఆర్ తదితరులు బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది.
రాజీనామాకు ఐదు కారణాలు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన రాజీనామాకు ఐదు కారణాలు వెల్లడించారు. కేసీఆర్కు అందించేందుకు మొత్తం మూడు పేజీల లేఖ రాశారు. ఐదు కారణాలలో.. 1. వ్యక్తిగత సమస్యలు, 2. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోవడం, 3. నియోజకవర్గ సమస్యలు, 4. రాష్ట్రస్థాయి ఇబ్బందులు, 5. పార్టీలో ఇబ్బందులు. మహేందర్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఆయనను టార్గెట్ చేస్తూ.. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారిని పార్టీలోకి, కేబినెట్లోకి తీసుకున్నారని కొండా తన లేఖలో పేర్కొన్నారు. పార్టీలో సమస్యలను పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. పార్టీలో తనను బలహీనపర్చారని తెలిపారు. కార్యకర్తలకు అన్యాయం జరగడం తనను బాధించిందన్నారు. గత రెండేళ్లుగా తెరాస పార్టీ.. ప్రజలకు దూరం అవుతోందని తీవ్ర వ్యాఖ్యలే తన లేఖలో పొందుపర్చారు.