ఆదిలోనే దెబ్బ: సుహాసిని గో బ్యాక్ అంటూ కూకట్పల్లిలో నినాదాలు, కారణమిదే
Recommended Video
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ కూడా అధికారికంగా ప్రకటన చేశారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును సంప్రదించి సుహాసిని పేరును ఖరారు చేసినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సుహాసిని శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశముంది. తొలుత తండ్రి హరికృష్ణ సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. ఆమె శనివారం నాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తే కేవలం కూకట్పల్లి నియోజకవర్గంతో పాటు కూటమికి కూడా కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.
భారీ మెజార్టీ ఖాయమా?: అందుకే కూకట్పల్లి బరిలో నందమూరి సుహాసిని, బాబుతో 20ని.లు భేటీ
సుహాసిని గో బ్యాక్
అదే సమయంలో నందమూరి సుహాసినికి ఆదిలోనే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గురువారం అలా టిక్కెట్ ఖరారు అయిందో లేదు, శుక్రవారం కాంగ్రెస్ వర్గీయులు కూకట్పల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుహాసిని గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
టీడీపీలో అసంతృప్తి, బుజ్జగింపు
సుహాసినికి టిక్కెట్ ఇవ్వడంపై అప్పటి వరకు ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డి, కూకట్పల్లి కార్పోరేటర్ మందాడి శ్రీనివాస రావు, ప్రేమ్ కుమార్ తదితరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వారు తమ అసంతృప్తిని పార్టీ అధిష్టానానికి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించారు. నందమూరి కుటుంబం బరిలో ఉంటే అన్ని రకాలుగా ప్లస్ అవుతుందని తెలిపారు.
పెద్దిరెడ్డికి చంద్రబాబు ఫోన్
పెద్దిరెడ్డి ఈ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. సుహాసినికి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో చంద్రబాబు ఆయనకు స్వయంగా ఫోన్ చేశారు. కుటుంబ కారణాలతో పాటు ఇతర కారణాల వల్ల సుహాసినికి టిక్కెట్ ఇస్తున్నామని, సహకరించాలని కోరారు. దానికి ఆయన ఒకింత అసంతృప్తితోనే ఓకే చెప్పారని తెలుస్తోంది. మీరే టిక్కెట్ ఇస్తానని చెప్పారని, ఇప్పుడు మీరే కాదని చెబుతున్నారని, అయినా సరేనని పెద్దిరెడ్డి చెప్పారని తెలుస్తోంది.
మందాడికి బుజ్జగింపు
తనకు టిక్కెట్ రాకపోవడం అవమానమేనని, అయినప్పటికీ తాను మహాకూటమికే మద్దతిస్తానని పెద్దిరెడ్డి చెప్పారని తెలుస్తోంది. మరోవైపు, మందడి శ్రీనివాసరావును కూడా అమరావతికి పిలిపించి చంద్రబాబు బుజ్జగించారు. పార్టీ గెలిచాక అవకాశాలు ఉంటాయని, టీడీపీ, మహాకూటమి గెలుపుకు సహకరించాలని చెప్పారు. మందాడి కూడా మెత్తబడ్డారని తెలుస్తోంది.
టీడీపీకి మరో రెండు సీట్లు ఏవి?
ఇదిలా ఉండగా, పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. టీడీపీ పోటీ చేసే పన్నెండు నియోజకవర్గాలపై స్పష్టత వచ్చింది. మరో రెండు నియోజకవర్గాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి జాబితా విడుదలయ్యాక తెలియనుంది. సనత్ నగర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, సికింద్రాబాద్, హుజురాబాద్ తదితర స్థానాలపై దృష్టి సారించింది.