నందమూరి సుహాసినికి గట్టి షాక్, తెరాసలో చేరిన కూకట్పల్లి కీలక నేత: కారణం ఇదీ
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచారు. ఆమె తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అందరినీ కలుస్తూ తనకు ఓటు వేయాలని కోరుతున్నారు.
అయితే ఆమె తీరు పట్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సుహాసిని తీరుతో మనస్థాపం చెందిన నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నేత మాధవంరం రంగారావు ఏకంగా పార్టీనే మారారు. ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
నందమూరి సుహాసినికి పురంధేశ్వరి ఆశీర్వాదం, టీడీపీ అభ్యర్థికి జగపతిబాబు మద్దతు
కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన కూకట్పల్లి కీలక నేత
తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో మాధవరం రంగారావు తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల తెరాస అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీలు పాల్గొన్నారు. సుహాసిని అతనిని పట్టించుకోకపోవడమే పార్టీ మారడానికి గల కారణంగా తెలుస్తోంది.
సుహాసిని తనను పట్టించుకోవడం లేదని
నియోజకవర్గంలో ప్రచారంలో తనను దూరం పెడుతున్నారని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని సుహాసిని పట్ల రంగారావు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. గతంలో వివేకానందనగర్ కాలనీ టీడీపీ కార్పొరేటర్గా ఆయన ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి తన భార్యకు టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ కాలనీ డివిజన్లకు ఇంచార్జిగా ఉన్నారు.
అరికపూడి గాంధీయే తెరాసలోకి రప్పించారా?
తెరాస నేత అరికపూడి గాంధీనే రంగారావును తెరాసలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారని తెలుస్తోంది. ఆయన చర్చలు జరిపి ఆయనను పార్టీ మారేలా చేసారని సమాచారం. కాగా, ఇది విపక్షాలకు రెండు నియోజకవర్గాలలో పెద్ద దెబ్బే.
అనూహ్యంగా తెరపైకి సుహాసిని
తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని అనూహ్యంగా తెరపైకి వచ్చారు. టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి, మందాడిల పేర్లు తొలుత వినిపించాయి. కానీ కూటమికి, టీడీపీకి బలం చేకూర్చడంతో పాటు నందమూరి కుటుంబం బరిలో ఉంటే ప్లస్ అవుతుందని భావించి సుహాసినిని తెరపైకి తెచ్చారు.