భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయం
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. ప్రతిపక్ష పార్టీలు క్రిందా మీదా పడినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల్లో అధికార టీఆర్ఎస్ . దూకుడు చూపించటంతో టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది. సంబరాలకు సిద్ధం అవుతున్నారు శ్రేణులు .
భైంసాలో నువ్వా నేనా ... బీజేపీ వర్సెస్ ఎంఐఎం
అయితే భైంసాలో మాత్రం బీజేపీ వర్సెస్ ఎంఐఎం హోరాహోరీ పోరు కొనసాగింది. చివరకు ఎంఐఎం సత్తా చాటింది. నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీపై ఎంఐఎం జెండా ఎగిరింది . హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించటం బీజేపీకి షాక్ అని చెప్పాలి . ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో మున్సిపల్ ఎన్నికల పోరు ఉత్కంఠ భరితంగా సాగింది .
భైంసాలో విజయం కోసం ఎంఐఎం, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 వార్డుల్లో గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా నిలవలేకపోయాయి. గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంత చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను సాధించి పట్టు నిలబెట్టుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది.కానీ ఎంఐఎం ను మాత్రం ఓడించలేకపోయింది.