కాంగ్రెస్ కు షాక్ .. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ .. ముహూర్తం ఖరారు
కాంగ్రెస్ పార్టీ కి స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా పెద్ద షాక్ తగలనుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కొనసాగుతున్న వలసల పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరగా ఇప్పుడు మరో ముగ్గురు చేరనున్నారని సమాచారం . ఒకవేళ అదే గనుక జరిగితే మొత్తం 18 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల్లో 13 మంది టీఆర్ఎస్ లో చేరినట్లవుతుంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డెడ్ చీప్ గా ఖరీదైన స్థలాలు .. మొన్న పువ్వాడ నేడు సండ్ర ?
టీఆర్ఎస్ బాట పట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముగ్గురు ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యాలని టీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ అంటోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరితే శాసనసభలో కాంగ్రెసు ప్రతిపక్ష హోదా రద్దు కానుంది. సీనియర్ నాయకులైన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
ఈ నెల 24న కారెక్కనున్న ఎమ్మెల్యేలు ..స్థానిక సంస్థల ఎన్నికలముందు కాంగ్రెస్ కు షాక్
ఈ నెల 24వ తేదీన ఈ ముగ్గురు శాసనసభ్యులు కూడా కారెక్కుతారని సమాచారం.ఆ ముగ్గురు శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరిన వెంటనే సిఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా వారు కోరే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో మిగిలేది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే కాంగ్రెసు పార్టీలో ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు.
శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రద్దయ్యే అవకాశం .. కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చెయ్యాలని కోరే ఛాన్స్
శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకుంటూ పోతుంది. 2014 ఎన్నికల్లో టీడీపీని విలీనం చేసుకున్నట్టు 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకునే ప్లాన్ లో ఉంది టీఆర్ఎస్ . ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చేరితే టీఆర్ఎస్ బలం 104కు పెరుగుతుంది. దీంతో శాసనసభలో ప్రతిపక్షాల పాత్ర నామమాత్రంగా మారుతుంది. తెలంగాణలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ మారుతోంది.