ఆర్టీసీ కార్మికుల సమ్మె.. పక్కా ప్లాన్తో తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 25 రోజులుగా కొనసాగుతున్నా,మరోపక్క కోర్టులో ఆర్టీసి సమ్మెపై ఆసక్తికర వాదనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది చేసి తీరుతున్నారు. సమ్మె కొనసాగిస్తున్న కార్మిక సంఘాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే యాక్షన్ ప్లాన్కు కెసీఆర్ శ్రీకారం చుట్టారు.
ఆర్టీసీ సమ్మె.. విలీనం ఓవర్ నైట్ పూర్తవుతుందా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ప్రధాన రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులు తిప్పే ప్లాన్
==మంగళవారం నుంచి కెసీఆర్ కొత్త యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. కార్పొరేషన్కు చెందిన బస్సులు, కార్మికులతో కొద్దిపాటు సర్వీసులను నడిపిస్తున్న తెలంగాణ సర్కార్, ఇప్పుడు ప్రైవేటు దిశగా అడుగులు వేయడం మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం రూట్లలో ప్రధాన రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులను తిప్పేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లను నుంచి టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక సీఎం కేసీఆర్ వ్యూహాన్ని అమలు చేయడానికి కసరత్తులు ప్రారంభమయ్యాయి.
క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
మొత్తం తెలంగాణవ్యాప్తంగా 3 నుంచి 4 వేల రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కెసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదిస్తే ఇక ఆర్టీసీలో ప్రైవేటీకరణ జరిగినట్టే భావించొచ్చు. ప్రస్తుతం ఈ ముసాయిదా సిద్దం కాగానే తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించి ఈ ప్రతిపాదనను ఆమోదించబోతున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం కార్మికులకు, కార్మిక సంఘ నాయకులకు పెద్ద షాక్ అని చెప్పాలి.
అద్దె బస్సుల నోటిఫికేషన్ కు భారీ స్పందన
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె నేపద్యంలో అద్దె బస్సుల కోసం జారీ చేసిన నోటిఫికేషన్కు భారీగానే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. వెయ్యి బస్సుల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే 21 వేల 453 అప్లికేషన్లు దాఖలయ్యాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు ఆపరేటర్లు కూడా తెలంగాణలో బస్సులను నడిపేందుకు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే 4 వేల బస్సులను అద్దెకు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సమ్మె ప్రభావం కనిపించదు అని అటు అధికారులు సైతం భావిస్తున్నారు.
50 శాతం ఆర్టీసీ ప్రైవేటీకరణకు కసరత్తులు
ఇక అంతే కాకుండా ఆ తర్వాత ఇపుడు నడుస్తున్న ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడా తగ్గించే ఆలోచనలో ఉంది సర్కార్. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తో సంస్థను 50శాతం ప్రైవేటుపరం చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంత సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చి, గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలన్న భావన సీఎం కేసీఆర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రస్తుతం సమ్మె చేస్తున్న కార్మికులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పడం నిర్వివాదాంశం. ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు సాగుతున్న ఈ పరిణామాలు ముందు ముందు ఆర్టీసీలో ఎలాంటి మార్పులకు కారణం అవుతాయో వేచి చూడాలి .