మునుగోడులో షాకయ్యేలా బోగస్ ఓట్లు: టీఆర్ఎస్, బీజేపీ కుట్ర; ఈసీకి కాంగ్రెస్ లేఖలో కీలకవిజ్ఞప్తి!!
మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మునుగోడులో బోగస్ ఓట్ల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నకిలీ ఓటర్లను సిద్ధం చేస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తుంటే, టీఆర్ఎస్, బీజేపీ కలిసి నకిలీ ఓటర్లను రంగంలోకి దించుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ మునుగోడులో బోగస్ ఓట్లను ఏరివేయాలని లేఖ రాసింది.
బోగస్ ఓట్లపై కాంగ్రెస్ టెన్షన్ ... ఈసీకి లేఖ
నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు చేరడం పై తెలంగాణ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తక్షణమే బోగస్ ఓట్లను తొలగించాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. జనవరిలో తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత, కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్చాలని చేసిన 25 వేల దరఖాస్తులను పునఃపరిశీలించాలని, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేఖ రాశారు. మునుగోడులో మొక్కుబడి పరిశీలన పేరుతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెద్ద ఎత్తున బోగస్ ఓట్లను చేర్చడానికి కుట్రలు చేస్తున్నాయని టిపిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ తాము రాసిన లేఖలో పేర్కొన్నారు.
బోగస్ ఓట్ల నియంత్రణకు కేంద్ర ఎన్నికల కమీషన్ తరపున ఒక బృందాన్ని పంపాలని విజ్ఞప్తి
బోగస్ ఓట్ల నమోదును నియంత్రించడం కోసం, కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున ఒక బృందాన్ని పంపించి దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నల్గొండ జిల్లా ఎన్నికల అథారిటీ మరియు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశంలో సైతం నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఈ అంశాన్ని లేవనెత్తారు. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి సుమారు 25 వేల దరఖాస్తులు వచ్చాయని, అవి ప్రక్రియలో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలియజేశారని పేర్కొన్న ఆయన అన్ని దరఖాస్తులు రావటంపై అనుమానం వ్యక్తం చేశారు.
కొత్త ఓటర్ల చేరికలను, తిరస్కరణలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని విజ్ఞప్తి
ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో చేర్పులకు ఉపసంహరణ తేదీ వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. పోలింగ్ బూత్ ల వారీగా పొందుపరిచిన, తిరస్కరించిన, ఆమోదించిన దరఖాస్తుల అన్ని వివరాలను బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు వీలుగా రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీని అభ్యర్థించారు. మొత్తానికి మునుగోడులో బోగస్ ఓటర్ల ఏరివేతకు ఈసీ దృష్టిసారించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మునుగోడు కాంగ్రెస్ కు అన్నీ అగ్ని పరీక్షలే
ఒకపక్క ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నా, మునుగోడులో హోరాహోరీగా పోరు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది. అడుగడుగునా కాంగ్రెస్ అగ్ని పరీక్షలను ఎదుర్కొంటుంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అధికార టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు చేస్తుంది. ఇక తాజాగా షాకింగ్ రేంజ్ లో ఓటర్లుగా అవకాశం కోసం చేసిన దరఖాస్తులపై బోగస్ ఓటర్లు అన్న అనుమానంతో కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.