కేసీఆర్ అండ్ కో అధికార దాహం.. హరీష్ చాప కింద నీరులా .. విజయశాంతి సంచలనం
టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సీఎం కావాలని ఒక అభిమాని 1016 కొబ్బరికాయలు కొట్టడం కలకలం రేపింది. ఈ సంఘటన గులాబీ బాస్ కెసిఆర్ కు, అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గుబులు పుట్టిస్తోంది . మొన్నటికి మొన్న మంత్రి ఈటెల రాజేందర్ గులాబీ జెండా ఓనర్ల మంటూ, ఎవరి దయాదాక్షిణ్యాల మీద మంత్రిని కాలేదంటూ ధిక్కార స్వరం వినిపించగా, ఇక తాజాగా హరీష్ రావు కోసం టీఆర్ఎస్ నేత విష్ణు హరీష్ రావు సీఎం కావాలంటూ జోగులాంబ గుడి లో 1016 కొబ్బరికాయలు కొట్టడం కూడా పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని ఇట్టే చెబుతుంది. ఇక ఈ ఘటనపై తెలంగాణా రాములమ్మ విజయశాంతి స్పందించారు .
టీడీపీ అంటే ఆంధ్రా పార్టీ అని కేసీఆర్ ముద్ర వేశారు ..అందుకే బీజేపీలో చేరానన్న రేవూరి
నిన్న ఈటెల .. నేడు మరో టీఆర్ఎస్ నేత .. ధిక్కార స్వరం ..
ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మామ కేసీఆర్ తర్వాత కీలక నేత అల్లుడు హరీష్ రావు కాగా ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. బయటకు వ్యక్తం చేయకున్నా హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు హరీష్ ను పక్కన పెట్టారు అన్న వాదనను తెరమీదకు తీసుకు రాగా తాజా పరిణామాలు గులాబీ పార్టీలో ఏదో జరగబోతుంది అన్న సంకేతాలు ఇస్తున్నాయి. మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమసిపోకముందే కొత్తగా హరీష్ విషయంలో కలకలం రేగింది. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు పేరు ఎవరు కనీసం ప్రస్తావించ కూడదని ప్రాధాన్యత తగ్గించిన కేసీఆర్ కు హరీష్ సీఎం కావాలని టిఆర్ఎస్ నేత మొక్కు చెల్లించడం పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తుంది అని చెప్పటానికి నాంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేత విజయశాంతి అయితే ఈ విషయంపై తన వ్యాఖ్యలతో గులాబీ గూటిలో అగ్నికి ఆర్జ్యం పోశారు.
తామే బాస్లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం .. గులాబీ పార్టీలో వర్గాలపై విజయశాంతి వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు ఓవైపు సమస్యలతో అల్లాడిపోతుంటే గులాబీ జెండాలకు తామే బాస్లమని ఓ వర్గం, సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటున్నాయని , అంతే కాదు ఎవరి ధోరణిలో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు . జనం డెంగీ, స్వైన్ఫ్లూ వంటి వ్యాధుల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే , ప్రజల సమస్యలను పక్కన పెట్టి వారిని పట్టించుకోవాల్సిన సమయంలో ఆ సమస్యలను బూచిగా చూపి మంత్రి ఈటెలను బలిపశువును చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని స్వయంగా ఈటెల తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు వార్తలు వచ్చాయని చెప్పారు విజయశాంతి .
కొడుకు కేటీఆర్ సీఎం కావాలని కేసీఆర్ ... ముఖ్యమంత్రి పీఠం కోసం హరీష్ పావులు కదుపుతున్నారన్న విజయశాంతి
ఇక కొడుకుకి అధికారం కట్టబెట్టాలని ఆలోచనలో ఉన్న కేసీఆర్ ఇప్పటికీ కీలక వ్యవస్థలు కొడుకు అండర్ లో ఉంచారని , జీహెచ్ఎంసీ, మునిసిపల్ వ్యవస్థలు ఇప్పటికీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని విజయ శాంతి పేర్కొన్నారు. రాష్ట్రం వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యం కోల్పోయిన మాజీ మంత్రి హరీశ్రావు మాత్రం సందట్లో సడేమియాలా ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించారు.
‘కేసీఆర్ అండ్ కో' అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విజయశాంతి ఆగ్రహం
తాను ముఖ్యమంత్రి కావడం కోసం అనుచరులతో కొబ్బరికాయులు కొట్టిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతున్నారని షాకింగ్ కామెంట్ చేశారు విజయశాంతి . బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చిన ‘కేసీఆర్ అండ్ కో' అధికార దాహంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ శాంతి తాజా వ్యాఖ్యలు గులాబీ పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రతికూల పరిణామాలతో హరీష్ రావు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓ టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పట్ల తనకున్న అభిమానం వ్యక్తం చేస్తూ హరీశ్రావు సీఎం కావాలంటూ టీఆర్ఎస్ నేత విష్ణు జోగుళాంబ గుడిలో 1016 టెంకాయలు కొట్టారు. ఈ తాజా పరిణామాలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.