షాక్: లోదుస్తుల్లో 2కేజీల గోల్డ్ స్మగ్లింగ్, నగర మహిళ ఢిల్లీలో అరెస్ట్
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కిలాడీ లేడీని ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన ఆమె.. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. కాగా, తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా బంగారాన్ని ఆమె తన లోదుస్తుల్లో దాచేసింది. సుమారు 64,38,960 రూపాయలు విలువ చేసే 2 కేజీల గోల్డ్ బార్లను, 160 గ్రాముల బంగారాన్ని ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన ఆ మహిళను హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్హాత్ ఉన్నీసాగా.. ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్(ఏఐయు) అధికారులు గుర్తించారు. ఉన్నీసా.. దుబాయ్ నుంచి తెచ్చిన సుమారు 2 కేజీల గోల్డ్ బార్స్ తో పాటు, 160 గ్రాముల బంగారాన్ని అండర్ గార్మెట్స్లో దాచి, అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా గుర్తించినట్లు ఎఐయు అధికారులు తెలిపారు. విదేశాలనుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.