షాకింగ్: తెలంగాణ అడ్వకేట్ జనరల్ రాజీనామా! ప్రభుత్వంతో విభేదాలే కారణమా?
హైదరాబాద్: తెలంగాణ అడ్వకేట్ జనరల్ (ఏజీ) ప్రకాశ్ రెడ్డి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్పై దాడి జరగడం.. ఈ ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్లపై అనర్హత వేటు వేయడం తెలిసిందే.
మంగళవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి, సంపత్ నియోజకవర్గాలైన నల్గొండ, అలంపూర్ ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోర్టు ఆదేశించింది.
మరోవైపు ఈ కేసు విచారణలో అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి వినిపించిన వాదనలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, కొంతకాలంగా అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య విభేదాలు పొడచూపినట్లు చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్ కేసు విచారణకు రావడానికి సరిగ్గా ఒక రోజు ముందే ఏజీ ప్రకాశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామాపై టీఆర్ఎస్ ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.