షాకింగ్ ...పద్మాక్షి గుట్టల్లో గుట్టుగా గంజాయి దందా .. మత్తులో యువత
హనుమకొండ నగరం నడిబొడ్డున పద్మాక్షి దేవాలయం సాక్షిగా పద్మాక్షి గుట్ట లో గుట్టుగా గంజాయి దందా జరుగుతోంది. మాదకద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయిని గంజాయి స్మగ్లర్లు విద్యార్థుల టార్గెట్ గా నగరంలో సరఫరా చేస్తున్నారు. పద్మాక్షి గుట్ట వద్ద విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తున్నారు. దీంతో యువత, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్న నేపధ్యంలో ఇంటర్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడి మత్తులో తూగుతున్నారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు అతని వద్దనుండి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతని వెనుక ఉన్న గంజాయి ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.
హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని పద్మాక్షి గుట్టల్లో విద్యార్థులకు, గంజాయికి అలవాటుపడినవారికి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు 1కిలో గం జాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ ఎల్. రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ లష్కర్సింగారం గ్రామానికి చెందిన అనుమాండ్ల నగేష్ అనే వ్యక్తి ప్రతీ రోజు పద్మాక్షి గుట్టలు, హనుమాన్ గుడి, ఓ ప్రైవేటు కళాశాల ప్రాంతంలో విద్యార్థులకు, పాత కస్టమర్లకు రూ. 500, 250కి ప్యాకెట్ చొప్పున విక్రయాలు జరుపుతున్నాడు.
పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని నగేష్ ను పట్టుకున్నారు. అతడి నుంచి ఎండు గంజాయితో పాటు సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగేష్ తనకు ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన సింగం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి విక్రయిస్తాడని, అతడు ఆంధ్రా ప్రాంతం నుంచి గంజాయి దిగుమతి చేస్తాడని తెలిపారు. నగేష్ వద్ద లభించిన గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని, గంజాయిని హన్మకొండ పోలీసులకు అప్పగించారు. అలాగే నగరంలో గంజాయి ట్రాఫికింగ్ చేసే ముఠా గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు పోలీసులు .